చంద్రబాబు 2019 ఎన్నికల కోసం స్పీడ్గా రెడీ అవుతున్నారు.వాస్తవంగా ఎన్నికలకు మరో యేడాదిన్నర టైం ఉన్నా ఒక వేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాబు వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం అయ్యేందుకు ఎలాంటి డెసిషన్లు తీసుకునేందుకు అయినా వెనుకాడడం లేదు. వచ్చే ఎన్నికల్లో సుమారుగా 40-50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను చంద్రబాబు పక్కన పెట్టేస్తారని వార్తలు వస్తుండగా ఇప్పుడు మరో బాంబు లాంటి వార్త కూడా వినపడుతోంది.
చంద్రబాబు ఒకటి రెండు నెలల్లోనే తన కేబినెట్ను మరోసారి ప్రక్షాళన చేసి..ఈ కొత్త కేబినెట్తోనే చివరి యేడాది అభివృద్దిని పరుగులు పెట్టించి, ఈ ఎన్నికల కేబినెట్తోనే 2019 ఫైనల్స్కు వెళ్లాలని భావిస్తున్నారట. చంద్రబాబు ఈ యేడాది ఆరంభంలోనే తన కేబినెట్ను భారీగా ప్రక్షాళన చేశారు. ఈ ప్రక్షాళన చేసిన కేబినెట్తోనే ఆయన ఎన్నికలకు వెళతారని అందరూ భావించారు. అయితే పాత మంత్రుల్లో కొందరు, కొత్తగా కేబినెట్లోకి వచ్చిన కొందరు మంత్రులు తన అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో ఆయన సీరియస్గానే ఉన్నారు.
ఇక త్వరలో జరిగే ప్రక్షాళనలో చంద్రబాబు తన టీంలోని సీనియర్లు ఇద్దరిని పక్కన పెట్టాలని డిసైడ్ చేసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అమరావతి సర్కిల్స్లో వినిపిస్తోన్న కథనాలను బట్టి తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి నారాయణపైనే తొలి వేటు పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికలకు ముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని నారాయణను ఏకంగా మంత్రి చేయడంతో అప్పట్లోనే పార్టీలో విమర్శలు వచ్చాయి. ఇటు నారాయణ, అటు ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు కూడా మంత్రులుగా ఉన్నారు.
ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు క్రమక్రమంగా నారాయణ ప్రయారిటీని తగ్గిస్తూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల నేపథ్యంలో నారాయణకు మరో నామినేటెడ్ పదవి వచ్చి మంత్రి నుంచి తప్పించేయాలన్న నిర్ణయానికి బాబు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ , ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడును తప్పిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆయన్ను వచ్చే యేడాది ఆరంభంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభకు నామినేట్ చేసేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
ఇక వీరిద్దరిని తప్పించడంతో పాటు కొత్తగా యువకులను కేబినెట్లోకి తీసుకుని చివరి యేడాది ప్రతిపక్షంపై పెద్ద ఎత్తున ఎటాక్ చేయించే ప్లాన్ బాబు వేస్తున్నారు. ఇక కొత్తగా కేబినెట్లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు ఉంది. రవికి లోకేశ్ ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. ఇక విప్ చింతమనేని ప్రభాకర్ సైతం రేసులో ఉన్నాడట. ఇక జేసీ బ్రదర్స్ కూడా తమకు బెర్త్ కావాలని బాబుపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారట. ఏదేమైనా ఈ ఫైనల్ ప్రక్షాళన మరోసారి ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతోంది.