మాజీ మంత్రి పీతల సుజాతను వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్.జగన్ చింతలపూడిలో మహిళా నేత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్కుమార్ భార్య మద్దాల దేవీప్రియను పోటీ చేయించగా సుజాత చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చింతలపూడి నుంచి బరిలోకి దిగేందుకు పలువురు ఆశావాహులు పోటీపడ్డారు. దయ్యాల నవీన్బాబును జగన్ సమన్వయకర్తగా నియమించారు.
పీతల సుజాతను ఢీ కొట్టాలంటే ఆర్థికంగా ఇంకా బలమైన క్యాండెట్ అవసరమని భావించిన జగన్ నవీన్బాబును తప్పించి ఆ ప్లేస్లో దమ్ము సుహాసినికి చింతలపూడి వైసీపీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. ఇక్కడ టీడీపీని ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థులు తప్పనిసరి అని భావించిన జగన్ కొద్ది రోజులుగా పశ్చిమపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె కర్ణాటక కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్వతంత్రరావు కుమార్తె దమ్ము సుహాసినిని ఇక్కడ నుంచి బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
ఇక దమ్ము సుహాసిని తండ్రి కర్ణాటక కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే, ఆమె భర్త దమ్ము మురళీధర్రావు కూడా హైదరాబాద్లో సివిల్ సర్వెంట్గా పని చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం రిజర్వ్ కావడంతో జగన్ ముందుచూపుతో దమ్ము సుహాసినిని చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇక సుహాసిని నియామకం వెనక కేవలం ఆర్థికకోణమే కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తాను రూ.20 కోట్లు సొంతంగా ఖర్చు చేస్తానని జగన్కు హామీ ఇవ్వడంతో జగన్ నియోజకవర్గానికి పూర్తిగా కొత్త అయిన ఆమెకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇటు టీడీపీ నుంచి మాజీ మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పీతల సుజాతను సుహాసిని ఎంత వరకు నిలువరిస్తారో ? చూడాలి.