నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి దీనిమీద ఎవరో ఒకరు స్పందించడంతో ప్రతిరోజు దీనిమీద ఏదో ఒక వివాదం సాగుతూనే ఉంది. నంది అవార్డుల విషయంలో సినీ ప్రముఖుల నుంచి అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రుద్రమదేవి సినిమా విషయంలో దర్శకుడు గుణశేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందంటూ బన్నీ వాసు, నిర్మాత నల్లమలుపు బుజ్జి ఇలా పులువురు ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై కమిటీ సభ్యులు జీవిత రాజశేఖర్ గట్టిగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు కొందరు ఉంటే, ఈ విమర్శకులకు కౌంటర్లు ఇచ్చేవారు మరికొందరు...ఇలా ఈ వివాదం సాగుతూనే ఉంది.
తాజాగా దీనిమీద ఐటీ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రకరకాల సందేహాలకు తావిస్తున్నాయి. ఏపీలో ఓటు హక్కు ఆధార్ కార్డు లేని వారు హైదరాబాద్ లో కూర్చుని విమర్శిస్తున్నారని.. అసలు అవార్డులే ఇవ్వని వారి గురించి మాట్లాడరని..ఏదైనా మీరు తెలంగాణలో మాట్లాడుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాదు..హైదరాబాద్లో కూర్చుని మాట్లాడే వారు ఎన్ ఆర్ ఐల తరహాలో నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఏ) అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వం పకడ్బందీగా జ్యూరీ ఏర్పాటు చేసి మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే ముఖ్యమంత్రిపై కొందరు హైదరాబాద్లో కూర్చుని విమర్శలు చేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే లోకేష్ వ్యాఖ్యలు ఇప్పుడు టీటీడీపీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను తెలంగాణలోనే పుట్టానని బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ఓటు హక్కు కలిగిన నారా లోకేష్ ఇప్పుడు ఏపీ మంత్రి అయినా హైదరాబాద్లో ఉన్నవాళ్లు విమర్శలు చేయడానికి అర్హులు కారా ? అన్న కోణంలో మాట్లాడడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పు అనేది ఎక్కడున్నా ? ఎవరైనా ఎత్తి చూపొచ్చు. ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లోను ఉంది. ఇదిలా ఏంటూ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా. మరి ఈ లెక్కన రేపు ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తెలంగాణలో టీడీపీకి ఓట్లు అడగరా ?. అసలు విమర్శలు చేయటానికి ఆధార్ కార్డు..ఓటర్ కార్డు లెక్కేంటి?. లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ టీడీపీ నేతలకు ఏమి సంకేతం పంపుతున్నారో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు. టీడీపీ భవిష్యత్ నేతగా చెబుతున్న లోకేష్ ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలను బట్టి తెలంగాణలో టీడీపీకి ఓట్లు అక్కర్లేదా ? అక్కడ పార్టీపై ఆశలు వదిలేసుకున్నాడా ? మరి లోకేష్ హైదరాబాద్లో బిజినెస్లు చేసుకుంటూ, అక్కడ ఇళ్లు ఎందుకు కట్టుకున్నాడు ? అనే డౌట్లే ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.