ఏపీ యువ మంత్రి భూమా అఖిలప్రియకు నారా లోకేశ్ అండగా నిలిచారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదం ఘటన కారణంగా ఆమె ఇటీవల విమర్శలు ఎదుర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే.. సమర్థత చూపకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కొన్ని పత్రాలు కథనాలు వండి వార్చాయి. రాజకీయాల్లో ఇలాంటి ఘటనల సమయంలో ఇలాంటి విమర్శలు చాలా సహజంగా జరుగుతుంటాయి.
ఐతే.. అఖిల ప్రియ యువ మంత్రిగా ఇప్పుడిప్పుడే తన సత్తా చాటు కుంటున్నారు. పర్యాటక మంత్రిగా అనేక సదస్సు, సభలు నిర్వహిస్తున్నారు. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్న ఆమె దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సమయంలో కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదం ఘటన ఆమె భవితవ్యంపై నీలినీడలు పరచింది. ఐతే.. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్ ఈ విషయంలో అఖిలప్రియకు అండగా నిలుస్తున్నారు.
లేటెస్టుగా నారా లోకేశ్ అఖిలప్రియ పదవిపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు.
మంత్రి వర్గ విస్తరణపై పార్టీలో ఆలోచనా లేదు.. ఆ చర్చా లేదు అని వివరణ ఇచ్చారు. కొన్ని మీడియాలో విస్తరణ పై వస్తున్న వార్తలు అవాస్తవమనీ... అఖిలప్రియ పని తీరు బాగుందని కితాబిచ్చారు నారా లోకేశ్. ఇటీవల అరకులో ఏపీ సర్కారు నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్, విజయవాడలో సోషల్ మీడియా సమ్మిట్ లను అఖిలప్రియ బాగా నిర్వహించారన్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా ఏపీ పర్యాటక రంగానికి మంచి పేరు వచ్చిందని లోకేశ్ అన్నారు. దీపికా పదుకొనె, రానా లు విజయవాడ వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామని లోకేశ్ చెప్పారు. బోట్ ప్రమాదం దురదృష్టకరమనీ.. కానీ దీన్ని అఖిలప్రియ అసమర్థతగా పరిగణించలేమని లోకేశ్ వివరణ ఇచ్చారు. పడవ ప్రమాదంపై సీఎం కూడా సీరియస్ గానే ఉన్నారని.. దోషులను వదిలే ప్రసక్తే లేదని లోకేశ్ అన్నారు.