ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యేందుకు జగన్ ఓ వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు పార్టీని 13 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పోస్టుమార్టం చేసుకుంటూ వస్తుంటే మరోవైపు నియోజకవర్గానికి పరిచయం లేని వ్యక్తులకు సమన్వయకర్తల పోస్టులు ఇస్తుండడం ఎవ్వరికి మింగుడుపడడం లేదు. ఇదిలా ఉంటే జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీలో ఎంతో కష్టపడుతున్నవారికి సైతం షాకులు ఇస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మార్చడం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా వెళ్లమనడం, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయాలని చెప్పడం చాలా మందికి నచ్చడం లేదు. దీంతో వారిలో కొందరు జగన్ నిర్ణయానికి ఎదురు చెప్పలేకపోతున్నా మరికొందరు మాత్రం జగన్ నిర్ణయానికే ఎదరు తిరగుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఆమెను కర్నూలు ఎంపీగా కాకుండా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నాడు జగన్. అయితే, బుట్టా మాత్రం.. ఎంపీగానే వెళ్తానని పట్టుబట్టింది. ఫలితంగా ఈ వివాదం తీవ్రమై ఆమె టీడీపీకి మద్దతు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు కూడా మరో మహిళా ఎమ్మెల్యే విషయంలో ఇలాగే జరుగుతోంది. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆమె నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు పార్టీ పరంగా దూసుకు వెళుతున్నారు.
ఇక అసెంబ్లీలోను, బయటా పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత పార్టీకి దూరమవ్వడంతో జగన్ గిడ్డి ఈశ్వరిని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఒకరు పార్టీలోకి వచ్చి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పాడేరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ఈశ్వరి కొద్ది రోజులుగా అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే సదరు మాజీ మంత్రి రాయలసీమకు చెందిన ఓ కీలక ఎమ్మెల్యే ద్వారా వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ సీటు ఇస్తే భారీగా ఫండ్ ఇస్తానని కూడా చెప్పారట.
చివరకు ఈ డీల్లోకి విజయసాయిరెడ్డి కూడా ఎంటర్ అవ్వడంతో సదరు మాజీ మంత్రికే పాడేరు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ డీల్కే ఓకే చెప్పిన జగన్ ఈశ్వరితో అరకులోయ ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా వుండాలని సూచించినట్టు సమాచారం. అయితే ఇందుకు ఆమె నిరాకరించారని, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పాడేరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దని జగన్కు గట్టిగానే చెప్పిందట. మన్యంలోనే కాకుండా, విశాఖ జిల్లాలో బలమైన లీడర్గా ఉన్న ఈశ్వరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ? అన్న డౌట్తో ఇప్పుడు జగన్ కూడా ఆమెకు ఎదురు చెప్పే సాహసం చేయలేకపోతున్నారట. మరి ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి.