పాలనాపరంగా ఏ మాత్రం అనుభవం లేకపోయినా తక్కువ కాలంలోనే పాలనపై ఏపీ మంత్రి లోకేష్ పట్టు బిగించినట్లే కనిపిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన శాఖపై పట్టు పెంచుకున్న ఆయన అసెంబ్లీ సమావేశాల్లో అదరగొడుతున్నారు. ఉపాధిహామీపై మండలిలో జరిగిన చర్చలో లోకేష్ పాల్గొన్న తీరు అదరహో అనిపించింది. ఏ మాత్రం తడబాటు లేకుండా అంకెలతో సహా అలవోకగా చెప్పేశారు లోకేష్.ఉపాధిహామీ అనుసంధానంతో గ్రామాల రూపురేఖలు మారుస్తామని నారాలోకేశ్ తెలిపారు.
2022నాటికి అన్ని గ్రామాలకూ తాగునీరు, సిమెంట్రోడ్లు, పక్కాగృహాలను పూర్తిచేస్తామన్నారు. ఉపాధిహామీ పథకం-వివిధశాఖల అనుసంధానం అనే అంశంపై జరిగిన చర్చకు లోకేశ్ సమాధానమిచ్చారు. ఉపాధిహామీ పథకాన్ని వివిధశాఖలకు అనుసంధానించి గ్రామాల స్వరూపాన్నే మార్చేస్తున్నామన్నారు లోకేష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఖర్చుచేసిన దానికంటే ఎక్కువమొత్తాన్ని ఈ మూడేళ్ల లోనే ఉపాధిహామీ ద్వారా ఖర్చుచేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 13వేల కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తిచేశామన్నారు.
అంగన్వాడీ భవనాలుసైతం తాము వచ్చాకే విస్తృతంగా చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో కేవలం 36 భవనాలు కడితే తాము అధికారంలోకి వచ్చాక 3వేల 655 అంగన్వాడీ భవనాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతిపనికీ అడ్డుతగులుతున్న వైసీపీ పైనా పెద్దల సభ సాక్షిగా నిప్పులు చెరిగారు యువనేత. ఉపాధిహామీతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే దీనిని ఓర్వలేక వైసీపీ నేతలు నిధులు ఇవ్వద్దంటూ కేంద్రానికి లేఖలు రాయడం దారుణమన్నారు. వారి లేఖల వల్ల ఆరువందల యాభైకోట్ల నిధులు విడుదలలో జాప్యం జరిగిందన్నారు.
ఉపాధిహామీ ద్వారా పనులు జరగడంలేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షనేత జగన్ నియోజకవర్గం పులివెందులలో 127కోట్లతో పనులుజరిగాయన్నారు లోకేష్. లోకేష్ మాట్లాడుతుంటే మండలిలో ఓ పాతికేళ్ల అనుభవమున్న రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఓ రీసెర్చ్ స్కాలర్ మాట్లాడుతున్నట్లు వినిపించింది. తొలిసారి మంత్రైన నాయకుడు మాట్లాడుతున్నట్లుగా ఏ మాత్రం కనిపించలేదు. ఇలాగే కఠినశ్రమతో ముందుకెళితే లోకేష్ చంద్రబాబును మించిపోవడం ఖాయం.