ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 6 నుంచి వైసీపీ నేత వైఎస్ జగన్ ‘ ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వ పాలనపై విరుచుకుపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు జగన్ కి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పాదయాత్రను కొనసాగించిన జగన్.. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడి పరిపాలనలో అప్పట్లోనూ నష్టపోయామని, ఇప్పుడూ నష్టపోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పేదలకు అందే పథకాలు, ఇళ్లు, సబ్సిడీలు, భూములు ఇవన్నీ అందడం లేదు. అప్పట్లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నందుకు తెలుగు ప్రజలు ఏం చూశారు? అప్పటివరకు ఉన్న మద్య నిషేధం గోవిందా... రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం గోవిందా... ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు గోవిందా... అని జగన్ వ్యాఖ్యానించారు. మన ప్రియతమ నేత దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు.
విద్యుత్ బకాయిల రద్దు జరిగిపోయింది... ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చింది.. పిల్లలందరూ చదువుకున్నారు.. ఎప్పుడూ లేని విధంగా 24 లక్షల ఇళ్లు కట్టి రికార్డు సృష్టించారు. మన కర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు మళ్లీ 2014లో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. మళ్లీ పేదల కష్టాలు మొదలయ్యాయి. రైతులకు న్యాయం జరగడంలేదు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయి. మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీనుంచి దిగిపోతేనే అందరి కళ్లలో ఆనందం నిండుతుంద'ని జగన్ వ్యాఖ్యానించారు.