తమిళనాడు చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యింది. దివంగత సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. డిసెంబర్ 21న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపింది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు డిసెంబర్ 4గా పేర్కొంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్కేనగర్లో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. గతంలో ఉపఎన్నికకు సిద్ధమైన ఈసీ.. డబ్బులు పంపిణీ, నిబంధల ఉల్లంఘనల కారణంతో ఎన్నికను వాయిదా వేసింది. ఇటీవల ఈ అంశంపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు డిసెంబర్ 31లోగా ఆర్కేనగర్ ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈసీ తాజాగా శుక్రవారం (నవంబర్ 24) షెడ్యూల్ను విడుదల చేసింది. పళనిస్వామి-పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య నెలకొన్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.