ఈ మద్య బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారని కొన్ని వర్గాలు అసలు సినిమా రిలీజ్ కానివ్వకుండా చూస్తామని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ‘పద్మావతి’ సినిమా పై కొత్త వివాదం చెలరేగింది. ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ‘పద్మావతి’ కోసం 40 ఏళ్ల వ్యక్తి జైపూర్ లోని నహర్ గఢ్ కోటకు ఉరి వేసుకొని చనిపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా సదరు యువకుడు రాసిన సూసైడ్ నోట్ లో 'తామెవరి తలలు నరకడం లేదని, ప్రాణత్యాగం చేస్తామ'ని పేర్కొన్నాడు. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు ఉరి వేసుకున్నాడా? లేక శవాన్ని తెచ్చి ఎవరైనా ఉరివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం దీపిక, సంజయ్ భన్సాలీల తలలు నరికివేస్తామని రాజ్పుత్ కర్ణిసేన ప్రకటించగా, ఈ సూసైడ్ ఘటనకి తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది కర్ణిసేన.
మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఏ వర్గానికి చెందిన వాడు, ఇది హత్య, ఆత్మహత్యనా.. అనే దానిపై పోలీసులు ఆరాలు తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, టైటిల్ పాత్రధారి దీపికా పదుకునే లకు భద్రత పెంచారు. వారి నివాసం వద్ద పోలీసులను మోహరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఈ సినిమాపై మరో వ్యాజ్యం దాఖలైంది.
పద్మావతి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకముందే జర్నలిస్టులకు ప్రదర్శించారని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 1న విడుదల కావలసిన ఈ మూవీ ఇప్పటికి సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోపోగా, వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణకి వెళ్లనుంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’లో దీపిక పదుకొణే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.