`జనసేన కూడా మరో ప్రజారాజ్యం కాకూడదన్నదే నా భయం` అని జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పడం.. అన్న, మెగాస్టార్ చిరంజీవికి ద్రోహం చేసిన వారికి జనసేన ద్వారా బుద్ధొచ్చేలా గుణపాఠం చెబుదామని పిలుపునివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత రెండు రోజులుగా పవన్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ.. కీలకాంశాలపై అందరిలోనూ ఉన్న సందేహాలు నివృత్తి చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావానికి కారణాలు, ఇతర అం శాలపై వాడీవేడిగా స్పందిస్తున్నారు. ప్రజారాజ్యం సమయంలో తనలోని సామాజిక స్పృహ గుర్తించలేదని చెబుతూ అల్లు అరవింద్ గుట్టంతా విప్పేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పవన్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే చర్చ మొదలైంది.
ప్రజారాజ్యం సమయంలో.. ఆ మాటకొస్తే ప్రజారాజ్యానికి బీజాలు వేసిన వారిలో అల్లు అరవింద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చిరంజీవి పార్టీ పెట్టిన దగ్గర నుంచి దానిని కాంగ్రెస్లో విలీనం చేసే వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు అరవింద్! ఎన్నికల సమయంలో పార్టీలో టికెట్లు అమ్ముకున్నారనే విమర్శ రావడానికి కూడా ప్రధాన కారణం అరవిందే అనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. దీంతో ఎన్నో కలలతో వచ్చిన ప్రజారాజ్యానికి కేవలం 18 సీట్లు దక్కాయి. అప్పటినుంచి పవన్.. అల్లు అరవింద్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేగాక చిరు, పవన్ల మధ్య గ్యాప్కు దూరం ఆయనే అనే పవన్ అభిమానులు బలంగా నమ్ముతారు.
ప్రజారాజ్యం ఓటమి తనను తీవ్రంగా బాధించిందని, పార్టీని విలీనం చేస్తున్న సమయంలో తాను సైలెంట్గా ఉండిపోవడానికి గల కారణాలను పవన్ వివరిస్తూ వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. `నేనేప్పుడు ఒక నాయకుడిని నమ్ముతాను. ఒక ఆలోచనా విధానం పెట్టుకుని ఒక నాయకుడు ముందుకు తీసుకువెళుతున్నప్పుడు.. ఒక కెప్టెన్ షిప్ని నడుపుతున్నప్పుడు.. ఆ నాయకుడిగా అన్నీ తెలుసు. అందుకే ఆ నాయకుడిని నేను అనుసరిస్తా. నాకు చాలా ఇబ్బందులనిపించినాయ్. నాకేం తెలియక కాదు. కాకపోతే నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది. ఆరోజు నేను చెబితే వినేలా లేదు` అని వివరించారు.
ఈ సందర్భంలో ఉదాహరణగా అల్లు అరవింద్ పేరు ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ని ఫలానా చోట ప్రచారానికి పంపించండి అని ఎవరో అన్నారని.. అప్పుడు అల్లు అరవింద్.. ఎందుకండీ.. `మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్చరణ్ ఉన్నాడుగా.. పంపించేయండి` అన్నారని వివరించారు. అప్పుడు ఆయన తనలోని నటుడినే చూశారు తప్ప.. అంతర్లీనంగా ఉన్న సామాజిక స్పృహ మాత్రం చూడలేదని చెప్పారు. ఇలాంటి వాతావరణంలో ఇంక ఏం మాట్లాడితే ఎవరు వింటారని, అందుకే చేతులు కట్టుకుని రోధించేవాడినన్నారు. అయితే ప్రజారాజ్యంలో క్రియాశీలక పాత్ర పోషించిన అరవింద్ను పవన్ టార్గెట్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.