అవును! రాజకీయాలంటేనే ట్విస్టులు! అందునా అపరచాణిక్యుడిగా పేరొందిన ఏపీ సీఎం చంద్రబాబు, అపర మేధావి, గుజరాత్ కే కాక దేశానికి కూడా దార్శనికుడిగా పేరు తెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీల మధ్య జరుగుతున్న రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి. ఇద్దరూ చెరో రాష్ట్ర అభివృద్దికి కృషి చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. బాబు ఏపీకోసం, మోడీ గుజరాత్ కోసం అహరహం శ్రమించారు. ఇక, ఈ క్రమంలోనే 2014లో ఇద్దరూ చేతులు చేతులు కలిపి.. ఎన్నికలకు వెళ్లారు ఏపీలో పొత్తు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చారు.
పదవులు సైతం పంచుకున్నారు. ఇంకేముందు చంద్రబాబు కాస్తా మోడీబాబు అయ్యారు. నరేంద్ర మోడీ కాస్తా బాబుమోడీ అయ్యారు. బీజేపీలో సంబరాలు చేసుకున్నారు. చంకలు గుద్దుకున్నారు. నవ యువ భారతావనిలో సిక్స్టీస్ దాటిని యువ నేతలు ప్రభుత్వాలను ఏలుతున్నారని గొప్పలు పోయారు.
రోజులు మారాయి. సంవత్సరాలు గడిచాయి. డామిట్.. మొత్తం స్టోరీ రివర్స్ అయింది! ముచ్చటైన కాపురం మూడున్నరేళ్లకే ఫట్టయినట్టుగా.. బాబు మోడీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది.
మోడీ అంటే బాబుకు నచ్చక, బాబంటే.. మోడీకి పడక.. రాజకీయం రసవత్తరం అయిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్ అంశాన్ని మోడీ ప్రభుత్వం దాదాపు పక్కనపెట్టేసింది. 16 వేల కోట్ల రెవెన్యూలోటు భర్తీపైనా లెక్కలు మార్చేసి 4 వేల కోట్లేనని కొత్త పల్లవి అందుకుంది. రాజధాని అమరావతికి అండాదండా ఇవ్వడం లేదని చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. తాజాగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపైనా కేంద్రం మీనమీషాలు లెక్కిస్తోంది. ఇది కేంద్ర ప్రాజెక్టే అయినా రాష్ట్రం చొరవ తీసుకుని పూర్తి చేస్తుంటే సహకరించడం లేదనే విమర్శలు చేస్తోంది. విభజన చట్టంలో ఉన్న వాగ్ధానంపైనా ఇన్ని కొర్రీలెందుకని బాబు ప్రభుత్వం రుసరుసలాడుతోంది.
పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినా.. రాష్ట్రం చొరవ తీసుకుందని ప్రకటించినా టెండర్లు, నిధులు, పరిమితులపై కొర్రీలు పెడుతోందని ఫీలవుతున్నారు చంద్రబాబు. పోలవరం నిర్మాణంపై మరీ అనుమానాలుంటే, దండంపెట్టి వదులుకుంటామని హెచ్చరించారు. అసలు మోడీ ఏడాదిన్నరగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని బాబు సీరియస్గా ఉండడం గమనార్హం. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా బీజేపీ తీరుపై బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మోడీ కావాలనే ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డైరెక్టుగా ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని తెలుగుదేశం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్తో కలిసి పోటీ చేయాలని బాబు ప్రణాళికలు వేస్తున్నారట.
అయితే మోడీ సర్కారు విషయంలో, ఆయన మద్దతు విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని మాత్రం భావిస్తున్నారు. దేశంలో మోడీ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో కాస్త ఓపికపట్టాలని సూచించారట. గుజరాత్ ఎన్నికల ఫలితాన్ని బట్టి వ్యూహం ఉంటుందని చెప్పారట. ఒకవేళ ఫలితం అటు ఇటు అయితే, ఇక బీజేపీ మీద స్వరం పెంచాలని, అదనుకోసం చూస్తున్నారు చంద్రబాబు. ఏపీకి కేంద్రం చేసిందేమీ లేదని, అవసరమైతే కేబినెట్ నుంచి బయటికొచ్చి ఇక యుద్ధం మొదలెట్టాలన్న కసితో బాబు ఉన్నారని సమాచారం.
అయితే, ఈ విషయంలో ఎలాంటి తొందరా మంచిది కాదని భావిస్తున్నారు.ఏదైనా కూడా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు. దీంతో మోడీ-బాబుల మధ్య అంతరం పెరుగుతుందని అర్ధమవుతోందని అంటున్నారు విశ్లేషకులు.