ఆంధ్రప్రదేశ్ లో స్థానికత పొందడానికి 70 శాతానికిపైగా ఏపీ ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు లోకల్ స్టేటస్ కోసం ఆరాటపడిన ఉద్యోగులే ఇప్పుడు మా కెందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. పిల్లల చదువులు కీలక దశలో ఉండటం, హైదరాబాద్ లో ఇప్పటికే స్థిరపడి ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
చాలామంది ఉద్యోగులు దశాబ్ద కాలానికి పైగా హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో పనిచేసి అక్కడే స్థిర పడ్డారు. వాళ్ల పిల్లల చదువులు హైదరాబాద్ లో కీలక దశలో ఉన్నాయి. అమరావతితో పోలిస్తే హైదరాబాదులో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తమకు, పిల్లలకు ఏపీలో స్థానికత కోసం దరఖాస్తు చేయడం అవసరం లేదని ఉద్యోగులు భావిస్తున్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే చదివిన కాలం కీలకం. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానికత పొందడం ఎందుకని వాళ్లు ఆలోచిస్తున్నారు. ఇక ఉద్యోగుల పిల్లలకు ఏపీలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడం కూడా సమస్యగా మారింది. అందుకే ఏపీలో లోకల్ స్టేటస్ కోసం చాలా మంది దరఖాస్తు చేయలేదు.
ఏడాది క్రితం ఆరు వేల మంది ఉద్యోగులు, విభాగాధిపతులు ఏపీ సచివాలయంలో పనిచేయడం కోసం అమరావతికి తరలి వచ్చారు. ఇందులో 2186 మంది మాత్రమే ఇప్పటి వరకు స్థానికత కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పద్దెనిమిది వందల మందికి లోకల్ స్టేటస్ ఇచ్చింది.
స్థానికత సమస్యను పరిష్కరించిన తర్వాతే పరిపాలనను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అంతవరకు తమ కుటుంబాలను అమరావతికి తరలించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అందుకే అమరావతిలో ఒంటరిగా ఉంటూ వారాంతాల్లో హైదరాబాద్ కు వెళ్లి వస్తున్నామని చెబుతున్నారు.
ఏపీలో రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే ఇంకో ఐదేళ్లయినా పడుతుంది. విద్యా, ఉద్యోగ అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవు. విజయవాడ వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. ఈ కారణాల వల్లే ఉద్యోగులు ఏపీలో స్థానికత పొందడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఈ సమస్యలను తొందరగా పరిష్కరిస్తే భారీ యెత్తున ఉద్యోగులు స్థానికత కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.