దేశంలో అనేక మిస్టరీలు ఉన్నాయి. దేశాన్ని పాలించిన ఇందిరా గాంధీ కుమారుడు ఎలా చనిపోయారు? దేశంలో కీలకంగా వ్యవహరించిన సుభాష్ చంద్రబోస్ ఎలా మరణించారు? మహాత్మా గాంధీని గాడ్సేనే కాల్చి చంపాడా? అయితే, ఆయన దేహంలో ఎన్ని బుల్లెట్లు దిగాయి? గాడ్సే కాకుండా మరొకరు కూడా గాంధీపై కాల్పులు జరిపారా? ఇలాంటి అనేక మిస్టరీలకు మన దేశం కేంద్రం! ఇక, ఇప్పుడు తమిళనాడును ఏకఛత్రాధి పత్యంగా ఏలిన పురుచ్చితలైవి, మహారాజ్ఞి జయలలిత మరణం కూడా మిస్టరీగా మారే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటి వరకు దీనిపై ఆమెకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి కొన్నాళ్లుగా చెబుతున్న వ్యాఖ్యలకు తాజాగా జయకు వైద్యం అందించామని చెబుతున్న వైద్య బృందం అందించిన సమాచారానికీ పొంతన లేకుండా పోయింది. దీంతో జయ మరణం మిస్టరీ ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క, తమిళ ప్రభుత్వం జయ మరణంపై కమిషన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
విషయంలోకి వెళ్తే.. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో అనారోగ్యం కారణంగా జయ చేరారు. అమ్మకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించేందుకు ఐదుగురితో కూడిన ప్రభుత్వ వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే నియమించింది. 75 రోజుల తర్వాత డిసెంబర్ 5న జయలలిత కన్నుమూశారు. దీనిపై ప్రతిపక్షాలు న్యాయవిచారణకు పట్టుపట్టడంతో గత ఏడాది సెప్టెంబర్ 25న ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 27 మంది తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు.
ఇందులో భాగంగా మరో వందమందికి పైగా ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాలు సమర్పించగా వీరికి సైతం సమన్లు పంపాల్సిందిగా కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి తన సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఆక్యుపంచర్ వైద్యుడు శంకర్, 13న జయ మేనకోడలు దీప, 14న దీప సోదరుడు దీపక్, 20న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మెహన్రావు హాజరయ్యేలా సమన్లు వెళ్లాయి.
కమిషన్ విచారణలో భాగంగా చైర్మన్గా ఆర్ముగస్వామి ముందు వాంగ్మూలం ఇచ్చిన ప్రభుత్వ వైద్యుల బృందం కొత్త విషయాలను బైటపెట్టింది. ఈ బృందం కో ఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ, ఇతర నలుగురు వైద్యులను కమిషన్ వేర్వేరుగా విచారణ జరిపింది. తిరుప్పరగున్రం, తంజావూరు, అరవకురిచ్చి ఉప ఎన్నికల్లో బీఫాం కోసం శశికళ సమక్షంలో తానే జయ వేలిముద్రలు సేకరించానని, ఆ సమయంలో మరెవ్వరూ లేరని బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆదే బృందంలోని మిగిలిన నలుగురు వైద్యులు మరో కోణాన్ని ఆవిష్కరించారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాము ఒక్కసారి కూడా జయలలితను నేరుగా చూడలేదని, తమ కళ్లెదురుగా సీటీస్కాన్కు తీసుకెళ్లినపుడు సైతం ఆమె చుట్టూ కర్టెన్ కట్టారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో తమ నలుగురికీ కనీసం టీవీ కూడా లేని ఒక ప్రత్యేక గదిని కేటాయించారని చెప్పారు. గది నుంచి అప్పుడప్పుడూ బయటకు వదులుతారని, ఆ సమయంలో జయకు జరుగుతున్న చికిత్సపై విడుదల చేస్తున్న బులెటిన్ను తమకు చదివి వినిపిస్తారని అన్నారు.
ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గదిలో కూర్చుని వెళ్లిపోవడం మినహా చేసింది ఏమీ లేదని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నియమించిన ఐదుగురు వైద్యుల బృందంలో బాలాజీ ఒక్కరు మాత్రమే జయ వద్దకు వెళ్లడం, మిగిలిన వారిని దూరంగా పెట్టడంపై అనుమానాలు రేగాయి. ఈ నెల 27వ తేదీన మరోసారి హాజరుకావాల్సిందిగా డాక్టర్ బాలాజీని కమిషన్ ఆదేశించింది. ఈ పరిణామాలను బట్టి జయ మృతి వ్యవహారం మరో మిస్టరీగా మారే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.