ఎన్నికలకు ఏడాదిన్నర ముందు చంద్రబాబు మరోసారి కేబినెట్ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారా..? ఢిల్లీకి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆర్ధిక మంత్రి యనమలను రాజ్యసభకు పంపుతారా.? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సిఎం... కొందరి పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్త ఇప్పుడు మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. ప్రస్తుతం ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే చర్చ.. ఒక పక్క ఖాళీ అవుతున్న రాజ్యసభ స్ధానాలు.. మరోపక్క ఎమ్మెల్సీలు.. ఇవన్నీ రాష్ట్ర కేబినెట్ లో మార్పులకు కారణమే. ప్రతిపక్షం నుంచి ఇప్పటికే 23 మంది శాసనసభ్యులు తమ పార్టీలో చేరడంతో మూడో రాజ్యసభ టికెట్ పై అధికార పార్టీ కన్నేసింది. అందుకు తగిన అభ్యర్దుల్ని సిద్దం చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మరో పక్క మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండంతో ఈ అవకాశాన్నీ కూడా వినియోగించుకోవాలని చూస్తోంది..
ప్రతిపక్షం నుంచి వలసలు ప్రోత్సహిస్తూనే ఆ పార్టీకి పట్టున్న జిల్లాలపైన బాబు దృష్టి సారించారు. వైసీపీకి నెల్లూరు జిల్లాలో అనుకూల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాపై సీఎం దృష్టి పెట్టారు. జిల్లాలో గట్టి పట్టున్న ఆనం రాంనారాయణ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆనం కుటుంబాన్ని అనుకూలంగా మార్చుకోవాలని బాబు భావిస్తున్నారు. రాజ్యసభకు వెళ్లాలని ఉందన్న యనమల రామకృష్ణుడు తాజా ప్రకటనతో ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణ బాధ్యతలను ఆనం రామ నారాయణ రెడ్డికి అప్పగించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం..
2019 లో వచ్చే ఎన్నికల టీం ను సిద్దం చేసే పనిలో సిఎం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై మరింత దృష్టి సారించారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా అన్ని కార్యాక్రమాలను సమర్థంగ నిర్వహిస్తున్న వారికి అవకాశం కల్పించేందుకు బాబు సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. సంక్రాంతి నుంచి ఫిబ్రవరిలోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు బాబు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి కేబినెట్లో స్థానం కోరుకుంటున్న యరపతినేని ఆశను తీర్చాలంటే ఆ జిల్లా నుంచి ఎవర్ని తప్పిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. మరోపక్క అనంత నుంచి పయ్యావుల కేశవ్ కూడా కేబినెట్ లో స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా నుంచి లోకేశ్ ఆప్తునిగా పేరున్న గొట్టిపాటి రవికుమార్ కు అవకాశం వస్తుందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో పార్టీలో కీలక నేతలకు అవకాశం కల్పించేందుకు బాబు సిద్ధమయ్యారు.