గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది.. భారీ పేలుడు సంభవించగా.. ఓ బాలుడు మృతి చెందాడు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామం గంగానమ్మపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుంటుంబం పాత డబ్బాల వ్యాపారం నిర్వహిస్తోంది. ఇంటి బయట ఈ పేలుడు జరిగింది. ప్రమాదంలో గాయపడినవారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
స్థానిక కొండ ప్రాంతంలో నాగరాజు కుటుంబం నివసిస్తోంది. ఆదివారం ఉదయం నాగరాజు తన ఇంటి ముందు పడేసి ఉన్న ఓ పెయింట్ బకెట్ను చూశాడు. మూత తెరవగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాలుడు గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజు, భవానీ, నాగమణి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు కొండ ప్రాంతాలను పేల్చేందుకు వాడే బాంబులు అందులో ఉండి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలిని సందర్శించిన డీఎస్పీ రామాంజనేయులు పేలుడుకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు.