ఇంద్రకీలాద్రిపై అధికారుల రాజ్యం నడుస్తోంది. పాలకపక్షం నిర్ణయాలను సైతం ఓవర్ టేక్ చేస్తున్న ఈవో సూర్యకుమారి తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. పాలకపక్షం, అధికారుల విభేదాల నడుమ భక్తులు నలిగిపోతున్నారు. తాజాగా గురుభవానీలు సైతం ఆలయంలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తమకు కనీస మర్యాదలు,వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మ భక్తుల ఆవేదనను ఆ అమ్మే పట్టించుకోవాలన్నట్టుంది పరిస్థితి.
ఇంద్రకీలాద్రిలో అధికారులు, పాలకపక్షం మధ్య విభేదాలతో భక్తుల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఈవో తన పరిధిని దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ పాలకపక్షం, పాలకపక్షం ఆరోపణల పెడచెవినపెడుతూ ఈవో ముందుకెళ్తుండడం తీవ్ర వివాదాస్పదమౌతోంది.
దుర్గమ్మసన్నిథిలో నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల సాక్షిగా విభేదాలు అనేక సార్లు బయటపడ్డా.. ఈవో తీరు మారడం లేదు. తాజాగా భవానీ దీక్షల విరమణ సందర్భంలో మరోసారి అధికారులు తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారుల తీరుపై గురు భవానీలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 40ఏళ్లుగా భవాని దీక్షలు స్వీకరించి గురుస్వాములుగా ఉన్న తమని అవమాన పరిచే విధంగా దుర్గ గుడి అధికారుల చర్యలు ఉంటున్నాయని వారు ఆరోపించారు.
దీక్షలో ఉన్న తమకు ఆలయ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదని చెబుతున్నారు. దీక్షలో ఉన్న స్వాములకు సద్ది, భిక్ష ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు. తమకు భక్తులు చేసే నిత్యాన్నదానంలో సద్ది చేయాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారని మండిపడుతున్నారు. అక్కడే సద్ది చేయలేక ఉపవాసం ఉంటున్నారు చాలా మంది గురుస్వాములు. కనీసం గురుభవానీలకు విశ్రాంతి తీసుకునేందుకు వసతులు కల్పించలేదని మండిపడుతున్నారు.
నిస్వార్థంగా సేవ చేసేందుకు తాము ముందుకు వస్తే తమ పట్ల అధికారుల తీరు సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు. అధికారుల తీరు కొద్దిరోజులుగా సరిగా లేదని గతంలో కూడా ఇలాగే అవమాన పరిచే విధంగా ఉన్నాయని గురు భవానీలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈవో, అధికారులు, పాలకపక్షం విభేదాలు పక్కన పెట్టి భక్తుల సేవలో తరించాలని భక్తజనం కోరుతున్నారు. దసరాశరన్నవరాత్రుల్లోనూ ఈవో తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రజా ప్రతినిధులను సైతం అవమానపరిచిన ఈవో తీరుపై అప్పట్లో పెను దుమారం చెలరేగింది. అయితే ఆ తర్వాత కూడా ఈవో సూర్యకుమారి తీరు మారకపోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.