దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడు అన్నది సామెత. ఇప్పుడు అచ్చం అలాగే తయారైంది ఏపీలో కొంత మంది అధికారుల తీరు. ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన కొనసాగుతుందని ఉపన్యాసాలు కొనసాగిస్తుంటే..మరోవైపు కొంత మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు డబ్బులిస్తే కానీ పని కాదని ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపి లో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని చెబుతున్నారు.
ఇక రాజధాని అమరావతి ఏర్పాటుకు అహర్శిశలూ శ్రమిస్తున్నామని..ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తమ అధికార నేతలు వారికి అందుబాటులో ఉంటూ వారి ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తారని చెబుతున్నారు. తాజాగా ఓ వృద్దురాలు తనకు ఫించన్ రావడం లేదని..తన కుమారుడు చనిపోయాడని..అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని..అయితే తనకు అన్ని అర్హతలు ఉన్నా ఫించన్ మాత్రం రావడం లేదని ఓ స్తంబానికి ఉన్న సీసీ కెమెరా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది.
తనకు రావాల్సిన పింఛన్ కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్థానిక నేతలు, అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆ సీసీ టీవీ కెమెరాను చూస్తూ రెండు చేతులూ జోడించి చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన బాధను చెప్పుకునే అవకాశం లేకుండా పోతోందని, తాను విజయనగరం నుంచి విజయవాడకు వచ్చానని ఆమె ఆవేదన చెందింది.