తమిళనాడులో ఎంతో ప్రజాదరణ పొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కొంత కాలంగా మిస్టరీగానే ఉంది. అమ్మ అంటూ తమిళ ప్రజలు అప్యాయంగా పిలుచుకునే నేత ఇక లేదని తెలిసి ఎంతో మంది గుండె పగిలింది..యావత్ తమిళరాష్ట్రం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే ఆమె మృతికి కారణం ఆమె సన్నిహితురాలు శశికళ అని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జయలలిత మృతి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్ మరో సంచలన సాక్ష్యాన్ని నమోదు చేసింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరడానికి కొద్దిరోజుల ముందు అధికంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యంపాలయ్యారని విచారణ కమిషన్ ఎదుట ఆక్యుపంచర్ డాక్టర్ శంకర్ వాంగ్మూలం ఇచ్చారు.గతంలో ఆమెకు ఆక్యుపంక్చర్ వైద్యం చేసిన ఆయన అరుముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం హాజరయ్యారు.
జయను ఆసుపత్రిలో చేర్చడానికి ముందు ఆమె నివాసంలో చికిత్స చేశారని, ఆ సమయంలో ఆమెకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చారని కమిషన్ ఎదుట సాక్ష్యం ఇచ్చారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయకు ఆక్యుపంచర్ వైద్యం అందించిన డాక్టర్ శంకర్ను మంగళవారం చెన్నైలోని కమిషన్ కార్యాలయంలో అధికారులు విచారించారు.
ఈ సందర్భంగా శంకర్ తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. ఈనెల 20న జయ సన్నిహితురాలు, మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న మరో మాజీ సీఎస్ రామ్మోహనరావులు విచారణ సంఘం ఎదుట హాజరుకానున్నారు.