టీటీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడిపి ల నుంచి ముఖ్య నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. ఈ మద్య టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మారారు. తాజాగా దివంగత తెలుగుదేశం నేత, మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి, భువనగిరి ప్రాంతంలో పట్టున్న టీడీపీ నాయకురాలు ఉమా మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి కలిశారు. ఇక రాష్ట్రాభివృద్ది కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలని తన మనోగతాన్ని సందీప్రెడ్డి వెల్లడించారు. తమ రాజీనామా విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా నిర్ణయాన్ని, ఆ నిర్ణయం తీసుకోవడం వెనకున్న కారణాన్ని తెలియజేశానని ఈ సందర్భంగా ఉమ వెల్లడించారు.
కార్యకర్తలతో చర్చించిన మీదటే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇప్పుడు భువనగిరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున ఆమెకు, ఆమె కుమారుడికి ఏ హామీ ఇస్తారన్నది తేలాల్సి ఉంది.
కాగా, గురువారం తెలంగాణ భవన్లో భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలసి పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి, సందీప్రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు.