తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు మరింత వీక్ అవుతోంది. రేవంత్రెడ్డి జంప్ తర్వాత తెలంగాణ టీడీపీ చాలా వరకు పతనం అయిపోగా, తాజాగా ఈ రోజు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తన కుమారుడితో సహా పార్టీకి రాజీనామా చేసేశారు. ఉమా మాధవరెడ్డి కారెక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో బాబుకు రైట్ హ్యాండ్గా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా త్వరలోనే పార్టీ వీడతారని వార్తలు వస్తున్నాయి.
అసలు టీటీడీపీని ముందుండి నడిపించే నాయకుడు కూడా కరువైపోతున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీలో పాలనే చూసుకోవడమే సరిపోతోంది. యేడాదిన్నర క్రితం వరకు తెలంగాణ టీడీపీ బాధ్యతలను చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పర్యవేక్షించే వారు. ఆయన ఏపీలో ఎమ్మెల్సీగా ఎంపికై, మంత్రి అవ్వడంతో లోకేష్కు ఏపీలోనే తీరిక సరిపోతోంది. వచ్చే ఎన్నికల వేళ ఏపీలో వైసీపీ నుంచి గట్టి పోటీ ఉండడంతో చంద్రబాబు, లోకేష్ కాన్సంట్రేషన్ అంతా ఏపీమీదే ఉంది. దీంతో టీటీడీపీని వారు పట్టించుకునే స్థితిలో లేరు.
టీటీడీపీని నడిపించే బలమైన నాయకుడు కూడా లేకపోవడంతో ఇక్కడ పార్టీకి మిగిలిన కొద్దిమంది నాయకులు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే బ్రాహ్మణి టీటీడీపీ పగ్గాలు చేపడుతున్నారంటూ కొద్ది రోజులుగా మీడియాలోను, సోషల్ మీడియాలోను వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నాయకత్వ పరంగా మంచి లక్షణాలు ఉన్న బ్రాహ్మణికి టీటీడీపీ పగ్గాలు ఇస్తే పార్టీ అక్కడ పుంజుకుంటుందని కొందరు టీటీడీపీ నాయకులు చంద్రబాబుకు సూచించినట్టు సమాచారం.
బ్రాహ్మణికి టీటీడీపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీని ఆమె ఓ గాడిలో పెడుతుందన్న విశ్వాసాన్ని వారు బాబు ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆమెను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచే అసెంబ్లీకి పోటీ చేయించాలని కూడా బాబుకు చెప్పారట. ఇందుకోసం ఆమెకు అనువైన నియోజకవర్గాన్ని కూడా వారే సూచించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బ్రాహ్మణి ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందని వారు బాబుకు సూచించారట. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరికెపూడి గాంధీ ఏకంగా 71 వేల మెజార్టీతో గెలిచారు.
ఆ తర్వాత గాంధీ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇక్కడ సీమాంధ్రులతో పాటు ఐటీ రంగం ఎఫెక్ట్ ఎక్కువ. అలాగే కమ్మ సామాజికవర్గం ఓటర్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీంతో బ్రాహ్మణిని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తే మంచి మెజార్టీతో గెలవడంతో పాటు పార్టీ తరపున తెలంగాణ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చి పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంతో పాటు అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటుందని టీటీడీపీ వర్గాలు బాబుకు చెప్పాయట. మరి బాబు బ్రాహ్మణి విషయంలో ఇంత రిస్క్ చేస్తారా ? అన్నది చూడాలి.