గత కొన్ని రోజులుగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలపై యావత్ భారత దేశంలో చర్చలు కొనసాగుతూ వచ్చాయి. ఇక ప్రచారంలో భాగంగా బిజెపి, కాంగ్రెస్ అధినాయకులే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. బిజెపి నుంచి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ తరుపు నుంచి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహూల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మద్య దాదాపు మాటల యుద్దం భారీ స్థాయిలోనే కొనసాగింది.
ఈ మద్య గుజరాత్ లో మొదటి దశ పోలింగ్ పూర్తి అయిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్ నేడు జరుగుతుంది. ఉత్తర, మధ్య గుజరాత్లోని 93 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ మేవానీ (వడగావ్), సురేశ్ పటేల్ (మణినగర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తాజాగా గుజరాత్ ఎన్నికలపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ విజయం సాధిస్తే దాయాది పాకిస్థాన్ పండుగ చేసుకుంటుందని.. పాకిస్థాన్లో సంబరాలు మిన్నంటుతాయని, బాణసంచా కాల్చి పండుగ చేసుకుంటారని అన్నారు. అదే బీజేపీ గెలిస్తే గుజరాత్ ప్రజలు పండుగ చేసుకుంటారని అన్నారు.
కాగా, గతంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గుజరాత్లో గెలుపు కోసం పాకిస్థాన్తో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికల రెండో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆనంద్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.