దేశంలో అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ను దాదాపు 20 ఏళ్లుగా నడిపిస్తున్న సోనియా గాంధీ ఇక, తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆమె హయాంలో ఏక ఛత్రాధిపత్యంగా 10 ఏళ్లపాటు కాంగ్రెస్ నేతృత్వలోని యూపిఏ ప్రభుత్వాన్ని నడిపించారు. అంతేకాదు, దేశంలో వెల్లువెత్తిన విదేశీ మహిళ అనే విమర్శలను సైతం అలా చేసిన వారే వెనక్కి తీసుకునేలా చేసి.. తన దైన శైలిలో రాజకీయాలు నడిపించారు. ఈ మొత్తం పదేళ్ల అధికారంలో మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేయడం ద్వారా తన వంతు పాత్రను తెర వెనుక ఉండి నడిపించారు సోనియా. గాంధీల కుటుంబంలో ఇటలీ నుంచి అడుగు పెట్టిన కోడలిగా ఆమె .. తన పాత్రను ఇంటికే పరిమితం చేయాలని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా జరిగిన రాజీవ్ హత్య, ఆ తర్వాత కాంగ్రెస్ పరిణామాల నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో సోనియా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి.. దేశంలో కలియదిరిగారు. యూపీలోని రాయ్బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వివిధ పార్టీలను చేరదీసి.. యూపీఏ కూటమిగా ఏర్పాటు చేసి.. దానికి బాధ్యత వహించారు. యూపీఏ చైర్ పర్సన్గా అన్ని పార్టీలనూ సంతృప్తి పరిచేందుకు కృషి చేశారు. మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ.. కీలక నిర్ణయాల విషయంలో ఏఐసీసీ బోర్డు తీసుకునేదే అంతిమం అయ్యేది. అంటే సోనియానే అంతిమంగా ఈ దేశాన్ని నడిపించే ప్రయత్నం చేశారు.
ఇక, ఇటీవల కాలంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఏకైక కుమారుడు రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే రాహుల్ నామినేషన్ పర్వం ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 16న శనివారం దీనికి సంబంధించిన ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ క్రమంలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన సోనియా.. తన రాజకీయం గురించి చెప్పుకొచ్చారు. తాను ఇక, సెలవు తీసుకుంటున్నానని అన్నారు. త్వరలోనే రాహుల్ పట్టాభిషిక్తుడు అవుతాడని చెప్పుకొచ్చారు. రేపు రిజల్ట్ అనంతరం ఓ శుభ ముహూర్తం చూసుకుని రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నాడు.
ఇక, ఇప్పుడు న్న పరిస్థితిలో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్కు కఠినమైన పరీక్షలు ఎదురు కానున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా బలంగా ఉండడం, బీజేపీ హవా సాగుతుండడం, మాటలతో ప్రజలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తుండడంతో మోడీ హవాను ఎదుర్కొనడం రాహుల్కు అంత వీజీ కాదనేది విశ్లేషకుల మాట. ప్రస్తుతం ముగిసిన గుజరాత్ ఫలితాలను బట్టి రాహుల్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సో.. మొత్తానికి కాంగ్రెస్లో యువ అధ్యక్షుడి రాక ఖాయమైపోయింది.