జనసేన జాగా చుట్టూ పొలిటికల్ రగడ మొదలైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం స్థలం వివాదాస్పదంగా మారింది. స్థలం వివాదం హైకోర్టులో ఉందని కొంతమంది ముస్లింలు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు తెలియకుండా తీసుకున్న తమ స్థలాన్ని తిరిగి ఇప్పించాలని ముస్లింలు కోరుతున్నారు. స్థలానికి తామే వారసులమంటున్నారు. మరోవైపు ముస్లింల పక్షాన నిలిచిన వైసీపీ నేతలు జనసేన ప్రశ్నిస్తున్నారు. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అవరోధాలు వెంటాడుతున్నాయి. రాజధాని ప్రాంతం చినకాకానిలో జనసేన తీసుకున్న స్థలం చుట్టూ వివాదం ముసురుకుంది.
మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 181, 182/1 , సర్వే నెంబర్ వున్న 10 ఎకరాలలో 3 ఎకరాలను జనసేన కార్యలయంకోసం జనసేన ప్రతినిధులు లీజుకు తీసుకున్నారు. వారంరోజుల క్రితం పవన్ కళ్యాణ్ సభ నిర్వహించి భూమి ఇచ్చిన రైతులను అభినందించారు. ఇప్పుడు అ స్థలం తమదంటూ మైనార్టీలు ఆందోళనకు దిగారు. కోర్టులో వివాదం నడుస్తోందని అందుకు తగిన ఆధారాలను చూపుతున్నారు. కోర్టులో వున్న స్థలాన్ని జనసేన నాయకుడు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా అనే పవన్ తెలిసి తీసుకున్నడా తెలియకుండా తీసుకున్నాడా అని వారు ప్రశ్నిస్తున్నారు.
1958 నుంచి ఈ స్థలంపై యార్లగడ్డ సుబ్బారావు, ముగ్ధం మోహిద్దున్ - జక్రియాల మధ్య వివాదం నడుస్తోంది. 1998లో గుంటూరు కోర్టులో యార్లగడ్డ సుబ్బారావు ఓడిపోయారు. అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ వేసిన ముస్లిం వర్గీయులు ల్యాండ్ పై హైకోర్టులో స్టే తీసుకువచ్చారు. నేటికీ స్టే కొనసాగుతోంది. కోర్టు విచారణలో వున్న స్థలాన్ని జనసేన కార్యకర్తలు లీజుకు తీసుకోవడం వివాదానికి దారితీస్తోంది. తమ స్థలాన్ని అక్రమంగా లీజుకు తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ దానిని రద్దు చేసుకుని న్యాయం చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పవన్ నుంచి స్పందన రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.
జనసేన లీజుకు తీసుకున్న స్థలం తమదేనంటూ పోరాడుతున్న ముస్లింలకు పలుపార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రతి విషయాన్ని ప్రశ్నించే పవన్ కోర్టులో వున్నస్థలాన్ని లీజుకు ఎలా తీసుకుంటారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీరుస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్న నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయితే.. జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ నడుస్తోన్న భూవివాదంపై పవన్ స్పందించారు. ఒకవేళ అది వివాదాంలో ఉంటే దాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటనలో తెలిపారు.