రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లాలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది వే బిల్లలు మాయాజాలంతో ప్రభుత్వానికి అనేకానేక ఇబ్బందులు తీసుకువచ్చిన మిల్లర్లను బ్లాక్ లిస్టులో ఉంచినప్పటికీ వారినే ఈ సారి ఏరి కోరి మరి అధికారులు ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడీ సమస్య అచ్చెన్న మెడకు చుట్టుకుంది.
వాస్తవానికి మిల్లరంతా అచ్చెన్నకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. దీంతో వీరి తప్పిదాలను మంత్రి హోదాలో వెనకేసుకువస్తున్నారన్న అపప్రద అచ్చెన్న మోయాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క బియ్యం గింజని కూడా కొనక మిల్లర్లు డ్రామాలు ఆడుతున్నారు. మొత్తంగా 313 మిల్లులు ఉంటే అందులో వందకు పైగా మిల్లులు మాత్రమే బ్యాంకు ష్యూరిటీ పొందాయి.
దీంతో వీరికి మాత్రమే ధాన్యం కొనుగోలు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో 131 కొనుగోలు కేంద్రాలు తెరవగా అందులో కేవలం ఒక్క రైతు నుంచి మాత్రమే 5.54 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్న అధికారులతో, మిల్లర్లతో సమావేశమై సీరియస్ అయ్యారు. సర్కారు ఆదేశాలు ఎవ్వరికీ పట్టడం లేదని, ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం వరకే గడువు ఇస్తున్నానని , ఈ లోగా బ్యాంకు గ్యారంటీలు అందించి ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలని తెలిపారు.మా పరువే కాదు ప్రభుత్వం పరువూ తీస్తున్నారంటూ మండి పడ్డారు.
డీసీసీబీ సీఈఓ సత్యనారాయణను పిలిపించుకుని శుక్రవారం నాటికి బ్యాంకు గ్యారంటీలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ వేంకటేశ్వరరావుతో సైతం మాట్లాడారు. తమకు మరో ఐదు రోజుల గడువు కావాలని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయిన రమేశ్ అడిగినా అందుకు మంత్రి, కలెక్టర్ ధనంజయరెడ్డి ససేమీరా అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో సైతం పౌర సరఫరాల అధికారి ఆర్ వేంకటేశ్వరావుపై ఆయన ఫైర్ అయ్యారు. మొత్తంగా అచ్చెన్న పట్టుతో మిల్లర్లు దారికి వస్తారో లేదో ? చూడాలి.