తెలుగునేల పులకించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతూ నవకవితా వైతాళికులతో నూత్న కవితా ఆస్వాదకులతో నయనానందకరంగా అత్యద్భుతరీతిలో ఆకాశమే హద్ద న్న ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయ. "అమ్మ భాష కమనీయత" ను ఆవిష్కరిస్తూ తెలంగాణ సంస్కృతి సౌరభాలతో భళిరా..భళి అన్న రీతిలో ఆరంభకార్యక్రమం సాగింది.
అశేష జనవాహినితో భాగ్యనగరం జాతరను తలపించింది. లాల్ బహదూర్ స్టేడియం లోపళా వెలుపలా మైదానం జనంతో కిక్కిరిసింది. ఖండాంతరాల్లోని తెలుగు భాషా ప్రియులతో వారి వారసులతో, తెలుగుతో ప్రేగు బందమున్న వారందరితో, తెలుగు మహాసభల సందోహ సంరంభోత్సవం అంబరసంబర విన్యాసాలతో విరిసింది.
వికసించింది. యశోమూర్తుల చిత్తరువులతో ప్రాంగణద్వార తోరణాలు నవ్యత సంతులిత నూత్న శోభను సంతరించు కున్నాయి. కాకతీయ తోరణం ప్రధాన వేదిక ద్వారం కాగా, ఆ పై పాలపిట్టల ప్రతిమలు అదనపు హంగులద్దాయి. పాల్కురికి ప్రాంగణంలో పోతన వేదికపై ఒక చేత జొన్నకంకి, మరోచేత బతుకమ్మను చేతబట్టి నాలుగు కోట్ల ప్రజల ఊపిరిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహం ఆ సభకు వన్నె తెచ్చింది.
ప్రపంచ తెలుగు మహాసభలను ఉప రాష్ట్రపతి తెలుగు వాచస్పతి ఉభయ తెలుగు ప్రజల ప్రతినిధి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించిన మరుక్షణం, భువి దివితో కలిపి దశదిక్కులు జయ జయ ద్వానాలతో ఆనందాహెలలతో హర్షద్వానాలతో ప్రపంచ తెలుగు మహా సభల ప్రాంగణమంతా మార్మోగింది. తెలుగు అక్షర సుమాలే నింగిలోని తారకల్లా మారి వెలుగులు విరజాజులు సుగంధ పరిమళాలను విరజిమ్ముతూ నింగి నేలా అక్కడి వాతావరణం హర్ష సుమాస్వితమనేలా తలపించింది. అంబరాన నిశీథియవనికపై బహు వర్ణ సంకలిత తెలుగు వెలుగు జిలుగులు విరిశాయి. ఆ మహాశివుని ప్రణయ తాండవమా అన్నట్లు ఒక్కసారిగా వెలుగుల ఉప్పెన వినువీదిలో 15 నిమిషాల పాటు బాణసంచా సప్తవర్ణాల కలయికతో కాంతులీనింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభిన తెలుగు భాషా ప్రియ సార్వభౌముడు తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం తొలిసారిగా నిర్వ హిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభదృశ్యమిది. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిన్న శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత మహాసభలు ప్రారంభమయ్యాయి. ఇది "తెలుగు భాషామతల్లికి సమర్పిస్తున్న నీరాజనం- తెలంగాణ సాంస్కృతిక వికాసానికి చేస్తున్న తొలి వందనం" అని ప్రభుత్వం ప్రకటించినట్లే ఏర్పాట్లు సాగాయి.
42 దేశాలనుంచి తరలివచిన 450కి పైగా మంది భాషాభిమానులు, ఇతర రాష్ట్రాల నుంచి ఏతెంచిన మరో 200 మంది, ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 8000 మంది భాషాభిమానులు మహాసభలకు తరలివచ్చారు. సభ కొంత ఆలస్యంగా సాయంత్రం 6 గంటలకు మొదలైనా, అంతకు గంటన్నర ముందే ప్రాంగణం తెలుగు భాషా జనావలితో ఆనంద సమ్రంభమే అయింది. ప్రానగణం క్రిక్కిరిసింది. స్వరరాజ సంకీర్తనాలతో శాస్త్రీయ సంగీత సాహితీ గాయనీమణులు నిత్య సంతోషిణి, లావణ్య లత కలిసి ప్రారంభ గీతాన్ని ఆలపించారు.
అలనాటి కాకతీయ జయపసేనాని విరచిత నృత్య రత్నావళి నుండి పల్లవైంచిన ‘పేరిణి లాస్యం’ కళాకృష్ణ నృత్య దర్శకత్వం లో వంద మంది నృత్యకారిణులతో సాగిన నర్తనమే మహాసభకు మనోఙ్జ నయనానందకర ఆరంభమైంది. అసలే సాహితీ మాగాణం తెలంగాణం అనిచెప్పిన కేసీఆర్, తెలుగు భాషా వికాసం ప్రభవించి పరిఢవిల్లాల్సిన సమయమిదేనని నడుం బిగించి పురోగమిద్ధామని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం పద్య సాహిత్యం పై ఆయనకున్న పట్టు, భాష పట్ల మమకారాన్ని మరోసారి స్పష్టం చేసింది.
పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, రాష్ట్ర ప్రధమ పౌరులు గవర్నర్ నరసింహన్ పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం ఒక అద్భుతం. "వెలుగు నేనే- తెలుగు నేనే" అంటూ నరసింహన్ తెలుగు వెలుగుల జిలుగూ నేనే నంటూ కవితాత్మకంగా ప్రభవించి వాగ్ధార కురిపించటం ఒక ముక్తాయింపు.
ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి గురించి చెప్పేదే ముంది కొద్ది సమయంలోనే తన స్వరరాగ ఆనంద ప్రవాహ ప్రసంగంతో ఆహూతులను తన సహజ శైలితో ప్రాసాపూరిత తెలుగు భాషానురక్తిని వేదిక నుండి గోదారి గగంగలా ప్రవహించారు.
ముఖ్యఅతిథులు సీతాకాంత్ మహాపాత్రో, ప్రతిభారాయ్, చైన్నై విశ్వవిద్యాలయ ఆచార్యలు మాడభూషి సంపత్కుమార్ను ప్రత్యేకంగా సన్మానించారు. వందేమాతరం శ్రీనివాస్ బృందం ఆలపించిన గీతం ఆహూతులనందరని అలరించగా, బోనాల నృత్యం, పోతరాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతికి దర్పణమై తరించాయి. వివిద కళాకారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి, దేశపతి శ్రీనివాస్ సన్మానించారు.