అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరికివారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2019లో అధికారంలోకి రావాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ సీనియర్లు.. ఆ దిశగా తీసుకుంటున్న చర్యల మాటేమో కానీ.. జూనియర్లు మాత్రం రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం వారు అనుభవిస్తున్న పదవులను కాదని కొత్తవాటిని కోరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ సోదరులుగా గుర్తింపు తెచ్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకంగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్లో తానే తోపునంటూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనలు గుప్పిస్తున్నాడు.
విషయంలోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీగా పేరు తెచ్చుకున్న ఈయన .. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా కంటే ఎమ్మెల్యే పదవులకే పోటీ పడేందుకు యత్నిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ టికెట్ ఇస్తే సరేసరి, లేదంటే స్వతంత్రంగానైనా బరిలో దిగేందుకు నిశ్చయించుకున్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓ అడుగు ముందుకేసి మునుగోడు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగకుండా చండూరు కేంద్రంగా భారీ సభకు సిద్ధమయ్యారు. ఈ నెల 17న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఆందోల్ మైసమ్మ గుడి నుంచి భారీ బైక్ ర్యాలీతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చండూరు చేరుకొని అక్కడ నియోజకవర్గస్థాయి బహిరంగ సభ నిర్వహించనున్నారు.
మునుగోడు నుంచి బరి లో దిగాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎంపీగా కంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గొలుపొంది రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల చండూరు మండలంలోని గట్టుప్పల్లో రాజగోపాల్రెడ్డి మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడు నుంచే బరిలో దిగుతానని, పార్టీ సైతం తనకు టికెట్ కేటాయిస్తుందని, గతంలో తన ఓటమికి స్రవంతే కారణమని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆమె రాజకీయ భవిష్యత్ను కాపాడతానని విస్పష్టంగా ప్రకటించారు.
రాజగోపాల్రెడ్డి హైదరాబాద్లోని తన స్వగృహంలో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, అనుచరులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్రవంతి వెంట నడిచిన వ్యక్తులను సైతం రాజగోపాల్ ఆహ్వానించగా, వారు హాజరుకావడం మునుగోడు నియోజకవర్గంలో కీలక పరిణామం. మొత్తంగా చూసుకుంటే.. రాజగోపాల్ రెడ్డి.. తన అన్న వెంకట రెడ్డి మాదిరిగానే రెబల్ రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ సీనియర్లు, బాధ్యులు ఈ తెగింపును ఎలా చూస్తారో? ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!