గత కొంత కాలంగా వి6 ఛానల్ లో ‘తీన్మార్’ వార్తల ద్వారా తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్. ఈ మద్య బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా కమెడియన్ గా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా బిత్తరి సత్తి.. హైదరాబాద్లోని ఫేస్బుక్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఎందుకో తెలుసా? ఆయన పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు తెరిచి వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారట.
ఈ మద్య బిత్తిరి సత్తి బాగా పాపులర్ కావడంతో మనోడిని కొంత మంది టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. రీసెంట్ గా బిత్తిరి సత్తిపై ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి తనకు అకౌంట్ లేదని.. కానీ ఎవరెవరో తన పేరిట ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని, ఆ అకౌంట్లను వెంటనే తొలగించాలంటూ హైదరాబాద్ ఫేస్బుక్ కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా తనదైన శైలిలో హాస్యంతో అక్కడి సిబ్బందితో సరదాగా మాట్లాడారు. తనను ఇక్కడ ఎవరూ గుర్తు పట్టనే లేదంటూ మధ్యమధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతూ కడపుబ్బా నవ్వించారు. అంతేకాక, ఫేస్బుక్ కార్యాలయ ఉద్యోగులందరికీ బిత్తిరి సత్తి ముందుగానే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.