గత కొన్ని రోజులుగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. బీజేపీ, కాంగ్రెస్ ల మద్య మాటల యుద్దం కొనసాగింది. గుజరాత్ లో తమ జెండా ఎగరేయాలని ఇరు పార్టీ అధినేతలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కూడా రక రకాల ఎత్తులు వేస్తూ..గెలుపు కోసం బాగానే కష్ట పడింది. అంతే కాదు అక్కడ పటేల్ ఓట్లు ఎక్కువగా ఉండటంతో హార్థిక్ పటేల్ ని తమ వైపు తిప్పుకుంది.
తాజాగా హార్థిక్ పటేల్ గుజరాత్ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెల్లడికానున్న నేపథ్యంలో పటీదార్ నేత హార్థిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం 17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హార్థిక్ పటేల్ వరుస ట్వీట్లలో సూచించారు.
బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన హార్థిక్ పటేల్.. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడంతో ఈ ట్వీట్లను పటీదార్లు (పటేల్ సామాజికవర్గం) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు.