ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఎంతగా మొరపెట్టుకుంటున్నా ఆయన పార్టీ నేతలు ఆయనను నమ్మడం లేదు. ఆయన మాటలను ఖాతరు చేయడం లేదు. వరస పెట్టి వలసల బాట పడుతూనే ఉన్నారు. నిజానికి వైసీపీ అధినేత గత నెల 6న పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వలసలు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. జగన్ కూడా అదే తలిచాడు. అయితే, అనూహ్యంగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు అధికార టీడీపీ కండువా కప్పేసుకున్నారు. వీరిలో అత్యంత కీలకమైన పాడేరు ఎమ్మెల్యే గీత కూడా ఉండడం పార్టీని తీవ్రంగా దెబ్బేసిందనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఆ తర్వాతైనా వలసలు, గోడదూకుళ్లు ఆగుతాయేమోనని నేతలు భావించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇక వెళ్లేవారు ఎవరూ లేరని చెప్పారు. అంతా భరోసాగానే ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఆదివారం వైసీపీ నుంచి మళ్లీ గోడదూకుళ్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ కర్నూలు జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు టీడీపీలో చేరారు. ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్, వైసీపీ విద్యార్ధి సంఘం నాయకులు టీడీపీలో చేరారు. వీరిని టీడీపీ కండువా కప్పి కొల్లు రవీంద్ర పార్టీలోకి ఆహ్వానించారు.
రెండు నెలల కిందట సీఎం చంద్రబాబు సమక్షంలో కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక కూడా బాబు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. పార్లమెంటు నిబంధనలు అడ్డువస్తాయని భావించి ఆమె కండువా కప్పుకోలేదు. కానీ, దాదాపు పూర్తిగా ఆమె పచ్చ గూటికి చేరిపోయిందనేది నిజం. ఇక, ఆమె భర్త నీలకంఠ ఇప్పటికే టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. బుట్టా రేణుక ఎంపీగా ఈ మూడున్నరేళ్లలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని అప్పట్లో చెప్పుకొచ్చారు. అందువల్ల ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే టీడీపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఆనాడు తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ప్రగతి పథంలో నడిపించి ప్రపంచ పటంలో గుర్తింపు తెచ్చా రని అన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నా నవ్యాంధ్రను మరింత ప్రగతి పథంలో నడిపి స్తున్నారని కితాబిచ్చారు. 2019లో టీడీపీ టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ తిరుగులేని విజయాలను సాధించింది. కానీ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సైకిలెక్కేశారు. జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించగానే వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరుతారని అప్పట్లో జోరుగా ప్రచారం జరింది. అయితే జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న సందర్భంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రారంభం కావడం విశేషం. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వలసలు ఇంకా కొనసాగుతాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే, టీడీపీ ప్రలోభాలకు లొంగిపోతున్న వారే పార్టీ మారుతున్నారని వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. ఏదేమైనా.. జగన్ మాత్ర తలపట్టుకుంటున్నాడు.