టెక్నాలజీతో పెరుగుతున్న సౌకర్యాలతోపాటే.. కష్టాలూ పెరుగుతున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో కాలుష్యం ఎంత పని చేసిందో చూశాం కదా.అలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం బతకడం కష్టమే. బతికినా అంతా రోగాలమయంగానే జీవితం సాగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఓ చోట నివశిస్తే మాత్రం సాధారణంగా కంటే మరో20ఏళ్లు అదనంగా బతకొచ్చట.
ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే. అందుకు నాదీ పూచీ అని భరోసా ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిని ప్రపంచ స్థాయిలో ఓ ప్రామాణిక నగరంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమంటున్న ఆయన అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం అనే అంశంపై సీఆర్డీఏ నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కు ఆయన చివరి రోజు హాజరయ్యారు.
అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నివినియోగించి అమరావతిని హ్యాపీసిటిగా మలుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి డిజిటల్ మ్యాపింగ్ కు సంబంధించిన జీఐఎస్ వెబ్ సైట్ తో పాటు భూమి రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టం, త్రీడీ మోడల్ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థను సీఎం ఈ సందర్భంగా లాంఛ్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు గతంలో తాను బీఓటీ తరహాలో హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ ఎకానమీగా మార్చేందుకు ఎన్నో వర్క్ షాప్స్ నిర్వహించామని అన్నారు.
మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ప్రపంచంలో అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకునేలా మలిచామని చంద్రబాబు తెలిపారు. ఎన్నో నగరాలు నిర్మించుకునే అవకాశం రావచ్చని.. పరిపాలనతో పాటు ఆర్ధిక వనరుల కేంద్రంగా ఓ నగరాన్ని నిర్మించుకునే అవకాశం అరుదుగానే వస్తుందని స్పష్టం చేశారు. వేల ఏళ్ల చరిత్ర అమరావతి ప్రాంతాన్ని తిరిగి నిర్మిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. పచ్చదనం, నదీ తీరం అమరావతికి అదనపు వనరులన్న చంద్రబాబు ఇక్కడ నివసిస్తే మరో 20 ఏళ్ల జీవితకాలం పెరుగుతుందని కామెంట్ చేశారు.