జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కొంచె ఆలస్యంగానైనా ఏపీ అధికార పార్టీ టీడీపీ వాడి, వేడి అంటే ఏమిటో తెలిసొచ్చిందనే అంటున్నారు విశ్లేషకులు. పవన్ అనుకుంటున్న టీడీపీ ప్రస్తుతం లేదని, అవరమైతే.. పవన్ ను బజారుకు ఈడ్చే టీడీపీనే ఇప్పుడు రాజ్యమేలుతోందని చెబుతున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. ఇటీవల జనసేనాని ఏపీలో మూడు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు. తాను నటించిన అజ్ఞాతవాసి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటున్న నేపథ్యంలో దొరికిన విరామాన్ని పవన్ చాలా ప్రణాళికా బద్ధంగా ఏపీకి కేటాయించారు. అదేసమయంలో విశాఖపట్నంలో తలెత్తిన డిసీఏ సమస్యపై ఆయన దృష్టి పెట్టారు. సదరు డ్రెడ్జింగ్ సంస్థను కేంద్రం ప్రైవేటు పరం చేయడం ఏంటని, దీనిని చూస్తూ కూర్చోవడం ఏంటని అటు కేంద్రాన్ని, ఇటు అధికార టీడీపీ ఎంపీలనుకూడా ఆయన కడిపారేశారు.
డీసీఏ ఉద్యోగి మరణంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పోలవరం వచ్చారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించి శ్వేత పత్రం విడుదల చేయాలంటూ.. పవన్ డిమాండ్ చేశారు. అదేసమయంలో కేంద్ర ప్రాజెక్టు అయినందున కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని చురకలు అంటించారు. ఇక, అదేసమయంలో టీడీపీ నేతలు సహా సీఎం చంద్రబాబు పదే పదే వల్లెవేస్తూ వచ్చిన ప్రాజెక్టు నిర్మాణం 2018 నాటికి పూర్తవుతుందన్న వ్యాఖ్యలను పవన్ తిప్పికొట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రాజెక్టు అప్పటికి పూర్తికాదని చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై కలకలం రేగింది. ఇక, అక్కడి నుంచి ఒంగోలు వెళ్లి.. కృష్ణానదిలో పడవ మునిగి మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేరుగా తిట్టకపోయినా.. మంత్రి అఖిల ప్రియను అడ్డుపెట్టి బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అయితే, ఈ కామెంట్లన్నీ సావధానంగా విన్న టీడీపీ నేతలు అప్పట్లో ఏమీ మాట్లాడలేదు. దీంతో 2014 నాటి పవన్ సాయం నేపథ్యంలోనే కృతజ్ఞతా పూర్వకంగా ఆయనతో తిట్లుతిన్నారని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, అనూహ్యంగా టీడీపీ నేతలు తమ గొంతులకు పని చెప్పారు. ఒక్కరొక్కరుగా ఆదివారం నుంచి పవన్పై రెచ్చిపోవడం ప్రారంభించారు. ఈ వరుసలో తొలిగా విశాఖ పట్నం జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే వంగల పూడి అనిత పవన్పై ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పవన్ కు ఉందని అంటూనే ఘాటైన విమర్శలు ఎక్కు పెట్టారు. అసలు విషయ పరిజ్ఞానం లేని పవన్కు పోలవరంపై మాట్లాడే అర్హతే లేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు పోలవరం ప్రాజెక్టుపై పవన్ కు అవగాహన లేదని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరంపై ఏమాత్రం అవగాహన లేని పవన్... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును ఎలా విమర్శిస్తారని పవన్కు తలంటేశారు. అంతేకాదు, చంద్రబాబు ఏదైనా అనుకుంటే సాధిస్తారని, ఈ విషయంలో పవన్ సొంత వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆమె చెప్పడం గమనార్హం. ఇక, ఇదే విషయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించారు. అనిత మాదిరిగా ఆయన నేరుగా ఘాటు వ్యాఖ్యలు చేయకపోయినా.. పోలవరం ప్రాజెక్టును సమయానికి కట్టి తీరతామని చెబుతూనే ఒక్క పవన్ కే కాకుండా ఏ ఒక్కరికి కూడా ఈ అనుమానాలు అవసరం లేదని వ్యాఖ్యనించారు. దీంతో ఇక, పవన్కి టీడీపీ వేడి తగలడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విమర్శలపై పవన్ అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.