విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు అత్యుత్సాహం ఎక్కువన్నది అందిరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం విజయవాడలో తెలంగాణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష అని చెప్పి దీక్షా శిబిరం నుండి మాయమై హైదరాబాద్ లో తేలి నిమ్స్ ఆసుపత్రిలోకి పరుగులు పెట్టి మంచం మీద ఎగిరి దూకి నానాహంగామా చేసి కేసీఆర్ చేసిన దీక్ష ఇదే అని ..తాను అలాగే చేశానని లేచి వెళ్లిపోయాడు. 
ఇక అప్పటి నుండి తెలంగాణ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా లగడపాటి రాజగోపాల్ దానిని ఖండించడంలో ముందుంటాడు. సమైక్యాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ లా ఫిక్సయ్యాడు లగడపాటి. తెలంగాణ కేంద్రం ఇవ్వదని, ఇస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నాడు. తీరా తెలంగాణ ప్రకటన వచ్చాక లగడపాటి స్టార్ బ్యాట్స్ మెన్ రంగంలో ఉన్నాడని తెలంగాణ రాదు అని చెబుతూ వస్తున్నాడు.
ఇక తాజాగా హైదరాబాద్ లో ఏపీఎన్జీఓలు నిర్వహించిన 'సేవ్ హైదరాబాద్' సభ విజయవంతం కావడంతో లగడపాటి సంతోషంగా ఉన్నాడు. సభ విజయవంతం కావడంతో సీమాంధ్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ బ్యాట్స్ మెన్ అయిపోయాడని, తెలంగాణలోనూ ప్రజలకు నాయకుడిగా కిరణ్ మీద విశ్వాసం పెరిగిందని లగడపాటి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం, డీజీపీ, ముఖ్యమంత్రి అండతో హైదరాబాద్ లో సభ పెట్టారు అని తెలంగాణవాదులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సమయంలో లగడపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చేటు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: