‘శోభమ్మ’ అని స్దానిక ప్రజలు ఆప్యాయంగా పిలుచుకొనే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, ఇక లేరని తెలియడంతో స్దానికం గా విషాద ఛాయలు అలుముకోన్నాయి. బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో తీవ్ర గాయాలతో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం ఆమె పార్దీవ దేహాన్ని ఆళ్ళగడ్డ లోని ఆమె స్వగృహం వద్ద ఉంచారు. ఆమె పార్దీవ దేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం ఆమె భౌతిక కాయాన్ని ఇంటి వద్దే ఉంచి, ఆ తరువాత భూమా నివాసం నుంచి పాత బస్టాండు, ఇండోర్ స్టేడియం, జాతీయ రహదారి, చిన్నకందుకూరి మెట్ట రాస్తా మీదుగా ఆమె అంతిమ యాత్ర సాగనుంది. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య జాతీయ రహదారికి సమీపంలోని సుద్దపల్లె క్రాస్ రోడ్ వద్ద ఉన్న సొంత స్ధలంలో శోభానాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: