మీడియా అంటే వళ్లుమండిపోతుంది కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణకు. అసలు తనకే గనుక అధికారముంటే మీడియా తాట తీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా అంత అవినీతి వ్యవస్థ మరొకటి లేదని అన్నారు. హైదరాబాదులో ప్రసారమాధ్యమాలపై శివాలెత్తిన ఆయన, ఎవరు డబ్బిస్తే వారికే మీడియా వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఛానెల్ ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతోందని, మీడియా సంస్థలు స్వార్థానికి పని చేస్తున్నాయని ఏకిపడేశారు. పేపర్, టీవీ.. ఇలా అన్ని తరహా మీడియా సంస్థలు భ్రష్టుపట్టిపోయాయని సర్వే ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరన్నా టీవీలు, పేపర్లను విమర్శిస్తే వారిమీద స్టింగ్ ఆపరేషన్ అంటూ వార్తలు ప్రసారం చేస్తారని ఆయన విమర్శించారు. అవినీతిమయమైపోయిన మీడియా అవినీతి గురించి మాట్లాడుతోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.జర్నలిస్టులను కూడా మీడియా సంస్థలు బతకనివ్వడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రసారమాధ్యమాలంత అవినీతి వ్యవస్థ మరోటి లేదంటూ సర్వే వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: