ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీపై తనదైన ముద్రవేసేందుకు సమాయత్తమౌతున్నారు. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను తన బలంగా మార్చుకుని, తనదైన పంథాలో నమో జపంతో ప్రధాని పీఠం అధిష్టించిన నరేంద్రమోడీ కేబినెట్ లో స్వామి భక్తిని, స్వభక్తిని చాటుకున్నారు. పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేసి రాజనీతజ్ఞతను చాటుకున్నారు. హోం మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతల భారంతో సతమవుతున్న రాజ్ నాథ్ సింగ్ కు కాస్త వెసులుబాటు కల్పించేందుకు పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించనున్నారు. కేబినెట్ రూపకల్పన, వివాద రహితంగా ఉండేందుకు కేబినెట్ కు షరతులు పెడుతున్న మోడీ, పార్టీలో కూడా తన మాట చెల్లుబాటయ్యేందుకు వీలుగా అమిత్ షాను పార్టీ అధ్యక్షుడ్ని చేయనున్నారు. అమిత్ షా మోడీకి అత్యంత సన్నిహితుడన్న విషయం జగమెరిగిన సత్యం. రేపు మధ్యహ్నాం 12 గంటలకు జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పేరు ఖరారుకానుంది. దీంతో బీజేపీ మోడీ మయం కానుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, పార్టీని ఉత్తరప్రదేశ్ లో వేళ్లూనుకునేలా చేశాడని, గుజరాత్ లో మోడీ గైర్హాజరీలో పార్టీని ఏకపక్షంగా గెలిపించాడనే పేరుంది. ప్రణాళికలు అమలు చేయడంలో అమిత్ షా చతురుడని రాజకీయ విశ్లేషకులు పేర్కొనడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: