ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యా సంవత్సరం నుంచి దాదాపు 450 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానుండగా.. ఇందులో ప్రైవేటు కళాశాలల్లో.. 300 సీటు,్ల ప్రభుత్వ కళాశాలలో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 800 సీట్లు అదనంగా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. అదనంగా మంజూరైనట్లు ప్రభుత్వం చెబుతున్న 800 మెడికల్ సీట్లలో 200 సీట్లు గతేడాది అనుమతించిన సీట్లే ఉన్నాయి. ఇందులో 500 సీట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మంజూరైనట్లు తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు 150 సీట్లు, పద్మావతి మెడికల్ కళాశాలలకు 150 సీట్లు ఈ విద్యా సంవత్సరంలో అదనంగా మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు. గత ఏడాది వివిధ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అదనంగా మంజూరు చేసిన 350 సీట్లలో 200 సీట్లును ఈ ఏడాది కూడా అనుమతించారు.
ఒంగోలు 100, స్విమ్స్ (తిరుపతి) 50, రంగరాయ మెడికకల్ కళాశాల (కాకినాడ) 50 సీట్లును ఈ ఏడాది కూడా అనుమతించారు. సిద్దార్థ (విజయవాడ), గుంటూరు, విశాఖ మెడికల్ కళాశాలల్లో గతేడాది అదనంగా మంజూరు చేసిన 150 సీట్లును ఎంసీఐ పునరుద్ధరించలేదు. మంజూరు చేసిన అదనపు సీట్లుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సౌకర్యాలను కల్పించకపోవడంతో ఈ సీట్లును ఎంసీఐ పునరుద్దరించలేదు. ఒంగోలు, కాకినాడ, స్విమ్స్ మెడికల్ కళాశాలల్లో కూడా ఎంసీఐ నిర్దేశించిన విధంగా సౌకర్యాలు కల్పించకపోయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎంసీఐ ఈ సీట్లును పునరుద్ధరించినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్విరామంగా కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ సీట్లును కాపాడుకోగలిగామని ఆయన చెప్పారు. ప్రైవేటులో మంజూరైన 300 సీట్లు ఏ ఏ కళాశాలలకు అనే దానిపై సమాచారం రావాల్సి ఉందన్నారు.
అయితే, 300 సీట్లలో 200 సీట్లు నెల్లూరులోని నారాయణ ఎపికి మూడు కొత్త వైద్య కళాశాలలు విద్యా సంస్థకు మంజూరైనట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేటు మెడికల్ కళాశాలకు 100 సీట్లు మంజూరైనట్లు సమాచారం. మిగిలిన 600 సీట్లలో 300 సీట్లు ప్రభుత్వ రంగంలోనూ, 300 ప్రైవేటులోనూ ఉన్నాయి. ఏ ఏ కళాశాలల్లో ఎన్ని సీట్లున్నాయో స్పష్టత రావడంతో ఆగస్టు 5 నుంచి మెడికల్ కౌన్సిలింగ్ను ప్రారంభిస్తామని మంత్రి కామినేని చెప్పారు. దీనిపై రెండుమూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెడికల్ ఫీజు పెంచాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నప్పటికీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నేపధ్యలో ఈ ఏడాది ఫీజుల విధానంలో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి ప్రైవేటు కళాశాలలు స్వతంత్రంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ ఈ ఏడాది సాధ్యం కాదని ఆయన చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: