సచివాలయంలో రాజధాని నిర్మాణం కోసమని హుండీ పెట్టి నిధులు అడుక్కోవడం దారుణమని, ఆంధ్ర రాష్ట్రం పరువుమర్యాదలను ముఖ్యమంత్రి చంద్రబాబు పాడు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుండీలు పెట్టడమంటే డ్రామాలు ఆడడమేనన్నారు. మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన చంద్రబాబును విమర్శించారు. ఎర్రచందనం అమ్మితే, హుండీలు పెట్టి అడుక్కుంటే ప్రజల కష్టాలు తీరుతాయా అని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే బందిపోట్ల రాజ్యంగా మారుస్తున్నారన్నారు. దుష్ట రాజకీయాలు చేయడంలో చంద్రబాబు మహానటుడన్నారు. నీ తప్పులను ప్రశ్నిస్తే తమపై ఎదురుదాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడికి కేటాయించిన గది చూస్తే చంద్రబాబు నైజం బయటపడుతుందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు చంద్రబాబును కలిసిన ఫోటోలను ఆయన విడుదల చేశారు. నిష్పక్షిపాతంగా విచారణ జరిపితే నాయకులు భాగోతం బయటపడుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: