ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్ణయించేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు హైదరాబాద్ రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ ఉదయం భేటీ కానుంది. రాజధాని విషయంలో త్వరలో కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, నేడు ఏపీ సీఎంతో కమిటీ జరపునున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాజధాని ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ కూడా నేడు ప్రత్యేకంగా భేటీ కానుంది. శివరామకృష్ణన్, చంద్రబాబుతో భేటీ కాకముందే ఈ ఉదయం 9 గంటలకు సమావేశం నిర్వహించనుంది. ఇంత హడావిడిగా ఈ కమిటీ సమావేశమవుతున్న క్రమంలో దాదాపుగా రాజధాని నిర్ణయంపై కీలక పరిణామాలు శుక్రవారమే వెలువడే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.  ఇదిలా ఉంటే రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి తాము సహకారం అందిస్తామని చెబుతూ ముందుకొచ్చిన మెకిన్సే కన్సల్టెన్సీ, గడచిన వారం రోజులుగా సలహా కమిటీ చైర్మన్ నారయణతో పాటు ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహిస్తోంది. ఆరువారాల పాటు ఉచితంగానే సహకరించేందుకు తాము సిద్ధమని ఆ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో నిర్వహిస్తున్న భేటీల్లో వివిధ అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను కూడా ప్రదర్శిస్తోంది. ఇక రాజధాని ఎక్కడ అన్న విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని సలహా సంఘం చైర్మన్ నారాయణ గురువారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండటంతో పాటు సమాన దూరంలో ఉండే ప్రాంతాన్నే రాజదానిగా ఎంపిక చేస్తామని, అది విజయవాడ-గుంటూరు మధ్యలోనే ఉంటుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: