ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో సంక్షోభం వచ్చి పడింది. విశాఖ పట్నం జిల్లా అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత ఆదివారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి కొత్తపల్లి గీత తమ పార్టీలోకి వస్తే తాము ఆహ్వానిస్తామని చెప్పారు. కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థానిక నాయకత్వం వ్యవహారాల శైలి పట్ల గీత అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.  స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డితోపాటు కొత్తపల్లి గీత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎస్పీవై రెడ్డితోపాటు కర్నూల్ లోక్ సభ సభ్యురాలు బుట్టా రేణుక భర్త, తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలుత తానూ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ప్రకటించిన బుట్టా రేణుక తర్వాత మాట మార్చారు. కొంతకాలంగా కొత్తపల్లి గీత పార్టీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: