మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. మణిపూర్‌లో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ) పై షర్మిల తన పోరాటాన్ని గత పద్నాలుగేళ్లుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిర్భందం తర్వాత రెండు రోజుల క్రితమే కోర్టు ఆదేశాలతో ఇరోం షర్మిల పోలీసుల బంధీ నుంచి విడుదలయ్యారు. అయినా తాను నిరసనను విరమించే ప్రసక్తే లేదని... ఇంటికి కూడా వెళ్లనని తేల్చి చెప్పారు. ప్రత్యేకాధికారాలక చట్టం రద్దు చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలోనే తన ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఇరోం షర్మిలను తాజాగా పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. షర్మిల ఆత్మహత్యకు యత్నిస్తున్నందున అరెస్ట్ చేసినట్లు మణిపూర్ అడిషినల్ డీజీ సంతోష్ తెలిపారు. అమానుష చట్టమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తూ షర్మిల గత 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్‌లోని ఓ గదిని ప్రత్యేక జైలుగా మార్చి.. పోలీసు నిర్బంధంలో ఆమెకు ఇన్నాళ్లు ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందించారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ దీక్ష ప్రారంభించారు. అయితే కోర్టు ఆదేశాలతో రెండు రోజుల క్రితమే పోలీసులు చాను షర్మిల ను అరెస్టు చేశారు. ప్రత్యేక అధికారాల చట్టం నేపథ్యంలో సాయుధ బలగాలు మణిపూర్ లో మాటల్లో చెప్పలేని అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయనేది షర్మిల చేస్తోన్న వాదన. అందుకే ఆ చట్టాన్ని తొలగించి అక్కడి మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ దీక్షను కొనసాగిస్తోంది. కేవలం ముక్కు ద్వారానే బలవంతంగా ఆహారం ఎక్కించుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్న ఆమె అందుకే మణిపూర్ ఉక్కు మహిళ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: