శివారులో అమానుషం... మానవ మృగాలు మరోసారి రెచ్చిపోయాయి. ఆటోల వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించాయి. అందులో ఉన్న మహిళపై దాడికి దిగాయి. సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డాయి. అడ్డుకునే ప్రయత్నంచిన వారిని చితకబాదారు. ఫోన్‌చేసిన పది నిమిషాల్లోనే ఘటనా స్థలంలో ఉంటామని చెబుతున్న పోలీసులు, బాధితులు సమాచారం ఇచ్చిన తర్వాత గంట సేపటికైనా రాలేదు. ఇన్‌స్పెక్టర్ స్పందించడంతో ఆలస్యంగా పెట్రోలింగ్ పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు.అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లైగింక దాడికి పాల్పడిన దుండగులు, బాధితురాలి వద్ద ఉన్న రూ. 3,000లు కూడా లాక్కుపోయారు. ఈ దారుణం సోమవారం అర్ధరాత్రి మేడిపల్లి శివారులో జరిగింది. పహాడీషరీఫ్‌లో యువతిపై జరిగిన లైంగిక దాడి ఘటన మరిచిపోకముందే మేడిపల్లిలో మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాధితులు, ఇన్‌స్పెక్టర్ రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేట లింగాల గ్రామానికి చెందిన మైసయ్య, అతడి భార్య (21) కలిసి ఉపాధి కోసం ఐదు నెలల కిందట నగరానికి వలస వచ్చారు. ఉప్పల్ బడా మసీదు ప్రాంతంలో నివాసముంటూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి పక్క గ్రామానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ పరిచయమయ్యాడు. దీంతో అతడు నల్గొండ జిల్లా, భువనగిరిలో బాలస్వామి వద్ద కూలి పనిచేసేందుకు వారిని పనికి కుదిర్చాడు. వీరితో పాటు మరో నలుగురు కూడా అక్కడికి పనికి వెళ్తున్నారు. ఈ ఏడుగురు సోమవారం అర్ధరాత్రి ఉప్పల్ నుంచి బయలు దేరి, మంగళవారం పనుల్లో చేరాల్సి ఉంది. సోమవారం భువనగిరి వెళ్లాల్సిన ఏడుగురు కూలీల్లో నలుగురు బస్సులో ముందుగా వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఆటోల బాధితురాలు, ఆమె భర్త మైసయ్య, సోదరుడు కలిసి ఉప్పల్ నుంచి ఆటోలో బయలు దేరారు. ఆటో ఉప్పల్ నుంచి అర్ధరాత్రి సమయంలో బయలుదేరింది. చీకటి రాత్రి.... ------------- రాత్రి ఒంటిగంట సమయంలో ఆటో నారపల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో మరో ఆటోలో వచ్చిన ఐదుగురు దుండగులు కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను అడ్డుకున్నారు. వెంటనే ఆటోలో ఉన్న బాధితురాలిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. దుండగుల చర్యలను ఆడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె భర్తను, సోదరుడిని చితకబాదారు. ఈ ఘటనతో ఆటో డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. దుండగుల దెబ్బలతో పడిపోయిన బాధితురాలి సోదరుడు, భర్త తేరుకొని, 100 నెంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గంట తర్వాత పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆటోలో వచ్చిన ఐదుగురు దుండగులు పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి బాధిరాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె వద్దనున్న మూడు వేల రూపాయలు లాక్కొని పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి మొబైల్ పార్టీ పోలీసులు వెంటనే బాధితురాలిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు... ----------------------- కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ రెడ్డి తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పలువురు ఆటో డ్రైవర్లను ఇప్పటికే విచారించామన్నారు. ప్రస్తుతం బాధితులు షాక్‌లో ఉన్నారని, వారిని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందన్నారు. బాధితురాలి కథనం ప్రకారం ఆటో డ్రైవర్ పాత్ర లేదని అతడ్ని కూడా ప్రశ్నిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: