మన ప్రజాస్వామ్యం కంచే చేను మేసిన చందంగా ఉంది. నేరస్తుల బారినుండి దేశాన్ని, ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాల్లోనే నేరగాళ్ళు ఉంటున్నారు. మన నాయకులు నేరస్తులకే అధికార పగ్గాలు అందించి అందలాలు ఎక్కిస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ క్రిమినల్ కేసులు ఉన్నవారిని మంత్రులుగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కొన్ని వివరాలు ఇవి. కొత్తగా గద్దెనెక్కిన కేబినెట్లో నేరగాళ్ళ చరిత్రను తెలుసుకుందాం. అవినీతికి చెక్ పెడతామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నాయకత్వంలోని నూతన ప్రభుత్వంలో 12 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
వీరిలో అందరికంటే ఎక్కువగా 13 కేసులతో ఫైర్బ్రాండ్ ఉమాభారతి కేబినెట్లోని నేరస్తుల జాబితాలో ప్రధమ స్థానంలో ఉన్నారు. మోడీ మంత్రిమండలిలో మొత్తం 45 మంది ఉండగా ఇందులో 12 మందిపై అంటే దాదాపుగా 27 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మంత్రుల్లో నితిన్ గడ్కరీపై 4 కేసులు ఉండగా, ఉపేంద్ర కుష్వహ, దాదారావ్ దాన్వేలపైన నాలుగేసి కేసులు ఉన్నాయి. కాగా, డాక్టర్ హర్షవర్థన్, జనరల్ వి.కె.సింగ్, రామ్విలాస్ పాశ్వాన్, ధర్మేంధ్ర ప్రధాన్లు రెండేసి చొప్పున కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ఒక్కొక్క కేసు ఉన్నవారు నలుగురు ఉన్నారు. వారు మేనకా గాంధీ, నరేంద్ర సింగ్ తోమార్, జుయాల్ ఓరమ్, సంజీవ్ కుమార్ బల్యాన్. ప్రభుత్వంలోనే కాదు విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే లోక్సభలోను నేరస్తులు పెద్దస్థాయిలోనే ఉన్నారు. ఇప్పుడే కాదు, గత లోక్సభలోను ఈ నేరగాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. ఆ వివరాలను పరిశీలసిఏ్త...ప్రస్తుత లోక్సభలో మొత్తం 543 మంది సభ్యుల్లో 541 మంది పూర్వాపరాలను, ఇంతకుముందు 2009 లోక్సభలో 543 మంది సభ్యులకు 521 మంది వివరాలను పరిశీలించారు. ఎన్నికల్లో విజేతలు పోటీకి దిగేటప్పుడే తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వారు తమ అఫిడవిట్లలోనే పేర్కొనడం గమనార్హం
ఈ మాచారం ప్రకారం పార్టీలవారీగా చూస్తే ఎన్నికల విజేతల్లో నేరస్తులు బిజెపికి చెందినవారు 22 శాతం ఉండగా కాంగ్రెస్పార్టీకి చెందినవారు 7 శాతం ఉన్నారు. అందరికంటే ఎక్కువగా శివసేనలో 44 శాతం మంది నేరస్తులే ఉన్నారు. ఎఐటిసికి చెందినవారు 12 శాతం మంది ఉండగా ఎఐఎడిఎంకెకు చెందినవారు 8 శాతం ఉన్నారు. ఈ ఏడాది అంటే 2014లో తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వారంతట వారే ప్రకటించిన లోక్సభ సభ్యులు 186 మంది ఉన్నారు. అంటే లోక్సభలో 34 శాతం మంది నేరగాళ్ళు ఉన్నారు. గత లోక్సభలో అంటే 2009లో విశ్లేషించిన 521 మందిలో 158 మంది అంటే 30 శాతం మంది నేరస్తులు ఉన్నారు. హత్య, హత్యాయత్నం, మత కలహాలు, కిడ్నాప్లు, మహిళలపై నేరాల కేసులు ఉన్నట్లు ప్రస్తుత లోక్సభలో 112 మంది అంటే 21 శాతం మంది ఉండగా, గత లోక్సభలో (2009) 77 మంది అంటే 15 శాతం మంది ఉన్నారు. 9 మంది లోక్సభ సభ్యలపై హత్య కేసులు ఉండగా ఇందులో నలుగురు బిజెపికి చెందినవారు. కాంగ్రెస్, ఎల్జెపి, ఆర్జెడి, స్వాభిమానపక్ష నుండి ఒక్కొక్కరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు.
10 మంది దొంగతనాలు, దోపిడీల కేసులు ఉండగా ఇందులో ఏడుగురు బిజెపికి చెందినవారే. ఆర్జెడి, స్వాభిమానపక్ష నుండి ఒక్కొక్కరు స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఏడుగురిపై కిడ్నాప్ కేసులు ఉండగా అందులో ముగ్గురు బిజెపికి చెందినవారే. ఎఐటిసి, ఎల్జెపి, ఆర్జెడిల నుండి ఒక్కొక్కరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి దిగేముందు ఇచ్చిన అఫిడవిట్లలో సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: