ప్రస్తుత యువతరంలో సినిమా హీరోల అభిమానం ఏరేంజ్ లో పెరిగి పోతుందో తెలిపే ఒక సంఘటన నేడు విజయవాడలో చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రిన్సు మహేష్ కోసం ఒక వీరాభిమాని ఆత్మహత్యాయాత్నం చేసుకోబోయాడు. ఈ వారం విడుదల కాబోతున్న ‘ఆగడు’ సినిమా కోసం మహేష్ అభిమానులు విజయవాడ అలంకార్ సెంటర్లో 90 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.  అయితే ఈ కటౌట్ ఏర్పాటు పై మున్సిపల్ అధికారులు అభ్యంతరం తెలిపి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఆ కటౌట్ ను తొలిగించే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపధ్యం లో అధికారులకు మహేష్ అభిమానులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అలంకార్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఇరు వర్గాలు పరస్పరం తోసేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కటౌట్ తొలగించి తీరుతామని అధికారులు స్పష్టం చేయటంతో మనస్తాపం చెందిన ఓ అభిమాని కటౌట్ పైనుంచి కాల్వలో దూకాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, మహేష్ అభిమానులు ఆ వీరాభిమానిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. పరిస్థితి మరింత అదుపు తప్పటంతో పోలిసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను అలంకార్ సెంటర్ నుంచి చెదరగొట్టారు అనే వార్తలు వస్తున్నాయి. హీరోల పై అభిమానం ఉండటం మంచిదే, కానీ ఇంత మితి మీరిన అభిమానo నేటి యువతరo భవిష్యత్తును ఎలా నాశనం చేస్తోందో చెప్పడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ.   

మరింత సమాచారం తెలుసుకోండి: