వైకాపా నేత సినీనటి రోజా ప్రాణాలకు ముప్పుందా... చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆమె ప్రాణాలకు మీదకు తేనున్నాయా.. ఈ అనుమానాలు వచ్చింది వైకాపా కార్యకర్తలకు కాదు.. రోజా అభిమానులకూ కాదు. సాక్షాత్తూ రోజా భర్త, సినీ దర్శకుడు సెల్వమణే ఇలాంటి అనుమానం వ్యక్తం చేశారు. రోజాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆందోళన చెందుతున్నాడు. భార్యకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని భయపడుతున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో అమ్మవారి ఊరేగింపు సందర్బంగా జరిగిన గొడవే సెల్వమణి భయానికి కారణం. అమ్మవారి జాతర సందర్భంగా తొలి హారతి అందుకునే విషయంలో.. టీడీపీ-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే హోదాలో తొలి హారతి తానే ఇస్తానని రోజా చెప్పడం.. అందుకు టీడీపీ కార్యకర్తలు అడ్డుతగలడంతో వివాదం మొదలైంది. అది కాస్తా తోపులాటగా మారింది. ఈ ఘర్షణలో రోజా చేతికి స్వల్పగాయమైంది. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే రోజాపై దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతలు అధికారం అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిపై స్పందించిన ఆమె భర్త సెల్వమణి.. రోజా ఎంతో భక్తి ప్రపత్తులు గలిగిన మహిళ అని.. హారతుల కోసం పాకులాడే మనిషి కాదని అంటున్నారు. రోజా చాలా ధైర్యశాలి అని భార్యకు కితాబిచ్చిన సెల్వమణి.. తనచేతికి గాయమైనా రోజా భయపడలేదన్నారు. అమ్మవారి హారతి పళ్లేన్ని తోసివేసినందుకే రోజా తీవ్రంగా కలత చెందారని సెల్వమణి చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం రోజాకు ఉన్నా.. ఓ భర్తకు ఆమె భద్రతపట్ల తనకు భయం వేస్తోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: