మహారాష్ట్ర ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించేందుకూ సిద్ధంగానే ఉన్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రకటించిందే తడవుగా రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో పోటీ చేసే విషయంపై రోడ్ మ్యాప్ రూపొందించుకునే పనిలో ఆ పార్టీ నేతలు మునిగిపోయారు. అయితే దాదాపుగా 25 ఏళ్ల పాటు మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేనకు తలుపులు తెరిచే వుంచామని పరోక్షంగా సూచించింది. పొత్తులో భాగంగా 288 సీట్లలో బీజేపీకి 119 సీట్లను ఆఫర్ చేస్తూ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రతిపాదనపై బీజేపీ మండిపడింది. తనకు 135 సీట్లను కేటాయించాల్సిందేనని బీజేపీ మొదటి నుంచి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే స్థానిక బలం పేరిట శివసేన అందుకు ససేమిరా అంటోంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన తర్వాత ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, శివసేన ప్రతిపాదనను తిరస్కరించింది. ఒంటరిగానే బరిలో దిగేందుకు తీర్మానించింది. మొత్తం 288 సీట్లలో అభ్యర్థులను నిలపాలని భావిస్తున్న బీజేపీ, కొన్ని సీట్లను తనతో కలసి వచ్చే చిన్న పార్టీలకు కేటాయించేందుకూ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అందులో భాగంగా కొన్ని సీట్లను మిత్రపక్షాలకు వదులుకునేందుకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: