టీడీపీని వీడే ఆలోచన లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టీడీపీలోనే ఉన్నానని, ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్న నేపధ్యంలో ఈ మధ్యాహ్నం ఆయన తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలు తనను బాగా బాధించాయని ఆయన తెలిపారు. మై హోమ్స్ రామేశ్వరరావు అన్యాయం జరిగిందని ఇప్పటికీ తాను నమ్ముతున్నానని ఆయన స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో రామేశ్వరరావు ఏమాట అన్నా తనకు ఇబ్బంది లేదని, ఆయన తప్పుంటే తాను వెనుకేసుకు రానని...ఈ విషయంలో, రామేశ్వరరావు తప్పు చేయలేదని ఇప్పటికీ తాను భావిస్తున్నానన్నారు.  అయితే, ఈ విషయాన్ని ఉపయోగించుకుని 'దొర' అంటూ ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి మాట్లాడటం తనకు నచ్చలేదని ఆయన తెలిపారు. పార్టీ అధినేత దృష్టికి ఈవిషయాన్ని తాను తీసుకువెళ్లానని, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. తనతో పాటు టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా ధర్మారెడ్డిని ఆహ్వానించానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: