నల్ల ధనంపై బిజెపి బండారం బయటపడింది. తమకు అధికారమిస్తే నల్లధనుల అంతుచూస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. గద్దెనెక్కిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కింది. నల్లధనుల పేర్లు బయటపెట్టలేమని ఇప్పుడు మాట మార్చింది. ఎన్నికల ముందు ఒక మాట, తరువాత ఒక మాట మాట్లాడడం బిజెపికే చెల్లింది.. స్విస్‌ బ్యాంకులోను, ఇతర పన్ను ఎగవేత స్వర్గధామాల్లోను నల్లధనాన్ని దాచుకున్న ఘరానా బాబుల పేర్లు వెల్లడించడం కుదరదని మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ ఎల్‌ దత్తుతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ శుక్రవారం నాడు ఈ మేరకు ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆయా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మూలంగా భారతీయుల విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించలేమని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. నల్లధనులపై విచారణ ఇంకా ప్రారంభం కాకపోవడం, ద్వంద్వ పన్నుల నివారణా ఒప్పందాలు, ఆయా బ్యాంకులు కస్టమర్ల భద్రతకు ఇచ్చిన హామీల వల్ల వీటిని గోప్యంగా వుంచక తప్పదని ప్రభుత్వం వాదించింది. గతంలో యుపిఏ ప్రభుత్వం కూడా ఇదే వాదన చేసింది. అప్పుడు ఆ వాదనను ప్రతిపక్ష బిజెపి అపహాస్యం చేసింది. ఆర్థిక నేరాల్లో లేని వారి పేర్లు వెల్లడిస్తే అది భారతీయులు నగదు దాచుకున్న రహస్యాలను బట్టబయలు చేసినట్లు అవుతుందని, ఇది ఆర్థిక సంస్థల నైతికతకు విరుద్ధమని ఇప్పుడదే బిజెపికి చెందిన ప్రభుత్వం వాదిస్తోంది. అత్యున్నత న్యాయస్థానం నల్లధనం వెలికితీతపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఎం.బి.షా నేతృత్వంలో సిట్‌ విచారణ జరుగుతోంది. దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీయటమే సిట్‌ లక్ష్యంగా సుప్రీం మార్గదర్శకాలు జారీ చేసింది.ప్రభుత్వం చట్టపర చర్యలు తీసుకోవాలనుకున్న అకౌంట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించగలమని రోహత్గీ అనంతరం విలేకరులతో చెప్పారు. దీనర్థం ప్రభుత్వానికి నచ్చనివారిపై మాత్రమే నల్లధనం జాబితాలో చేర్చుతారని విశ్లేషకులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: