నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆమె భువనగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ ప్రభంజనం కారణంగా ఘోర ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం, భువనగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీని వీడాలని అనుచరులు ఆమె మీద ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అయితే, ఆమెను చేర్చుకునే విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.  వాస్తవంగా, సార్వత్రిక ఎన్నికల ముందే ఆమె టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లాలనుకున్నారు. నల్లగొండ జిల్లాలో తాను చెప్పిన వారికి సీట్లు కేటాయించకపోవడంపై అప్పట్లో ఆమె టీడీపీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత చంద్రబాబు అప్పటికి ఎలాగోలా ఉమా మాధవరెడ్డికి సర్ది చెప్పగలిగారు. భర్త మాధవరెడ్డి ఆకస్మిక మరణంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో, చంద్రబాబు హయాంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: