తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇప్పుడు ఏం చేస్తున్నారు. బెయిల్పై విడుదలైన ఆమె రోజూ ఎవర్ని కలుస్తున్నారు.తన అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వారికి అమ్మ ఏం చేశారు. పరప్పన అగ్రహారం జైలు నుంచి బెయిల్పై విడుదలైన తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇప్పుడు కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. బెయిల్ ఇచ్చే ముందు కోర్టు పలు సూచనలు, నిబంధనలు పెట్టడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్న ఆమె ఇంటి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. మామూలు సమయాల్లో జయ ఇల్లు పోయెస్ గార్డెన్ రోజూ వందలాది మంది కార్యకర్తలు, నేతలతో కిటకిటలాడుతుంది. అమ్మ దర్శనం కోసం జనం క్యూ కడతారు. కానీ ఇప్పుడు అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇంటి పని వాళ్లు మినహా ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. తన కోసం ఎవ్వరూ ఇంటికి రావొద్దని జయ ఆదేశించడంతో అక్కడ ఈ పరిస్తితి నెలకొంది.  ఇక ఎంత ఇబ్బంది ఉన్నా పార్టీ ముఖ్య నేతల్ని ఇంటికి పిల్చుకుని చర్చలు జరపడం జయలలితకు అలవాటు. కానీ ఈ సారి ఒక్కర్ని కూడా కబురు పంపలేదు. అంతేకాదు సీఎం పన్నీర్ సెల్వంను తన ఇంటి చాయలకు కూడా రావొద్దని జయ వార్నింగ్ ఇచ్చినంత లెవల్లో చెప్పారట. దీంతో చిన్నా చితకా నేతలు అమ్మ ఇంటి పరిసరాలకే వెళ్లడానికి వణికి పోతున్నారు. ఇక జైలు నుంచి బెయిల్పై ఇంటికి వచ్చిన జయకు శుభాకాంక్షలు తెలిపారు సూపర్స్టార్ రజనీకాంత్. మంచి ఆరోగ్యం, ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నట్లు జయకు లేఖ రాశారు. జయలలిత జైల్లో ఉన్నప్పుడు ఆమెకు మద్దతుగా తమిళ సినీ ఇండస్ట్రీ ధర్నాకు దిగింది. అయితే ఆ ధర్నాలో రజనీ పాల్గొనలేదు. దీంతో జయకు లేఖరాసినట్లు రజనీ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక మన ఏందిరన్ లేఖకు రిప్లయి ఇచ్చారు పురచ్చితలైవి. తాను ధైర్యంగా ఉన్నానని చెప్పిన ఆమె రజనీకాంత్ కుటుంబానికి దేవుడు అన్ని విధాలా అండగా ఉండాలంటూ ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే రజనీ లేఖ రాయడం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు తమిళ నేతలు. త్వరలో విడుదల కానున్న లింగా సినిమాకు జయ అభిమానులు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా ఉండేందుకే రజనీ లేఖ రాశారని చెబుతున్నారు. ఇక తన అరెస్ట్ వార్త విని తమిళనాడు వ్యాప్తంగా 193 మంది చనిపోయారు. వీరి రుణం తీర్చుకున్నారు జయలలిత. తన కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి 3 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అంతేకాదు ఆత్మహత్యాయత్నం చేసిన వారికి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికీ 50 వేల రూపాయల పరిహారం డిక్లేర్ చేశారు. మొత్తానికి తనకు తానే ఇంట్లో బందీగా ఉన్నారు జయలలిత. చేసిన పాపం ఇలా వేధిస్తుందని ఊహించని అమ్మ....ఒక్క శశికళతోనే మనసువిప్పి మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: