తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కరెంటు కష్టాల గురించి ఉద్యమిస్తున్న బీజేపీ వాళ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు, ప్రదర్శనలకు దిగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... వాళ్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మ దహనం చేయడం! తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు. ఆయనవల్లనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు అని అంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తామే కారణం అని చెబుతున్న చంద్రబాబు తెలంగాణ విద్యుత్ కష్టాలకు కూడా బాధ్యత వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ లో విద్యుత్ ఉత్పత్తి ఆఫించి చంద్రబాబు తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని... వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఇదే పాటను అందుకోవడం విశేషం. చంద్రబాబు వల్లనే విద్యుత్ కష్టాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనే తెలంగాణ విద్యుత్ కష్టాలకు కారణం అని వారు అంటున్నారు. మరి ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోందా... లేక ఏదో పొరపాటున జరిగిందా? అనేది ఆర్థం కావడం లేదు. ఒకవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య స్నేహం చెడిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఆది నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్లు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా దిష్టి బొమ్మదహనం వరకూ వచ్చింది వ్యవహారం. మరి ఇకపై ఎలా ఉంటుందో ఈ బంధం!

మరింత సమాచారం తెలుసుకోండి: